Warangal: బాలుడి ప్రాణం తీసిన విదేశీ చాక్లెట్‌

ఆ తండ్రి విదేశీ పర్యటనకు వెళ్లి ఇంటికి తీసుకువచ్చిన చాక్లెట్‌ తన కుమారుడి ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు...

Published : 27 Nov 2022 10:26 IST

మట్టెవాడ (వరంగల్‌): ఆ తండ్రి విదేశీ పర్యటనకు వెళ్లి ఇంటికి తీసుకువచ్చిన చాక్లెట్‌ తన కుమారుడి ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు. చాక్లెట్‌ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్‌ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్‌ బతుకుతెరువు కోసం వరంగల్‌ వచ్చి డాల్ఫిన్‌ గల్లీలో స్థిరపడ్డారు. ఎలక్ట్రికల్‌ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య గీత, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. 

స్థానిక శారద పబ్లిక్‌ స్కూల్‌లో ముగ్గురు చిన్నారులు చదువుతున్నారు. ఇటీవల కంగర్‌సింగ్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి తిరిగొచ్చారు. శనివారం పిల్లలు స్కూల్‌కు వెళ్లే క్రమంలో విదేశాల నుంచి తండ్రి తీసుకొచ్చిన చాక్లెట్‌ను వారికి ఇచ్చారు. వీరిలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్‌ (8) స్కూల్‌కు వెళ్లి చాక్లెట్‌ను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కింద పడిపోయాడు. గమనించిన పాఠశాల సిబ్బంది తండ్రికి సమాచారం అందించి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.  గొంతులో చాక్లెట్‌ను గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే సందీప్‌ మృతిచెందాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని