logo

అనుకున్నదాని కంటే ఎక్కువే తరలిస్తున్నారు..!

జిల్లాలో గ్రానైట్‌ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా రాయిని తరలించుకుపోతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అనుమతికి మించి గ్రానైట్‌ను భారీ మొత్తంలో తరలిస్తూ.. అధికంగా సంపాదిస్తున్నారు.

Published : 30 Nov 2022 03:53 IST

మహబూబాబాద్‌ నుంచి అక్రమంగా తీసుకెళుతూ..

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లాలో గ్రానైట్‌ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా రాయిని తరలించుకుపోతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అనుమతికి మించి గ్రానైట్‌ను భారీ మొత్తంలో తరలిస్తూ.. అధికంగా సంపాదిస్తున్నారు. ఇంత చేసినా భూగర్భ గనుల శాఖాధికారులు మాత్రం ఈ ఏడాది ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ తనిఖీలు చేసినా చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

క్వారీల్లో తవ్వకాలు..

ఇక్కడి నుంచి ప్రతి నెలా రూ.కోట్ల విలువైన గ్రానైట్‌ వివిధ ప్రాంతాలకు తరలిపోతోంది. గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లో 168 గ్రానైట్‌ క్వారీలు ఉంటే.. వాటిలో సుమారు 60కి పైగా క్వారీల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిబంధనల మేరకు వసూలు చేసిన సీనరేజీ కింద వసూలు చేసిన సుమారు రూ.6 కోట్లకు పైగా నిధులు ఇతర జిల్లాకు వెళ్లి నష్టం జరిగింది. అంతేగాకుండా జిల్లాకు చెందిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తనిఖీలు చేయకపోవడంతో తమ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.

పరిమాణంలో తేడాలు

క్వారీల నుంచి ఇతర ప్రాంతాలకు గ్రానైట్‌ను తరలించేందుకు వ్యాపారులు తీసుకున్న అనుమతికి విరుద్ధంగా ఎక్కువ పరిమాణంలో గ్రానైట్‌ను తరలిస్తున్నారు. ఒక్క వాహనంలో 4.5 మెట్రిక్‌ టన్నుల నుంచి 5.5 మెట్రిక్‌ టన్నుల వరకు అనుమతి ఇస్తారు. పెద్దపరిమాణం ఉన్న మెట్రిక్‌ టన్ను నలుపు రంగు గ్రానైట్‌ రూ.1,361 రుసుం చెల్లించాలి. తక్కువ పరిమాణం కలిగిన మెట్రిక్‌ టన్ను గ్రానైట్‌కు రూ.1,128 చెల్లించాలి. అయితే వ్యాపారులు మాత్రం కొందరు అధికారులను మచ్చిక చేసుకుని 7 మెట్రిక్‌ టన్నుల వరకు బరువు ఉన్న గ్రానైట్‌ను తీసుకెళుతూ సగం రుసుం మాత్రమే ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అంతేగాకుండా ఒకే ట్రక్‌ షీట్‌ మీద రెండు, మూడు సార్లు గ్రానైట్‌ను తరలిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.

దెబ్బతింటున్న రహదారులు

పెద్ద, చిన్న వాహనాల్లో అధిక బరువు ఉన్న గ్రానైట్‌ను తరలిస్తుండడం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయి. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో నెల్లికుదురు మండలంలోని ఓ గ్రామంలో అధిక లోడ్‌తో వెళుతున్న గ్రానైట్‌ లారీని స్థానికులు అడ్డుకోవడంతో సంబంధిత క్వారీ నిర్వాహకులు వచ్చి రహదారి మరమ్మతు చేయిస్తామని చెప్పి వెళ్లారు. లోడు అధికంగా తీసుకెళ్లడంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. వీటి మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయడంతో ప్రభుత్వానికి అదనపు భారం పడుతుంది.


అధిక బరువుకు.. మాకేం సంబంధం లేదు
- రవీందర్‌, ఇన్‌ఛార్జి భూగర్భ గనుల శాఖాధికారి

గ్రానైట్‌ క్వారీల అనుమతికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర కార్యాలయం నుంచే అనుమతులు వస్తాయి. ఎలాంటి వివరాలు మా వద్ద ఉండవు. నిబంధనలకు విరుద్దంగా అధిక బరువు కలిగిన గ్రానైట్‌ను తరలిస్తే తనిఖీలు చేయాల్సిన బాధ్యత రవాణా శాఖాధికారులపై ఉంది. ఈ సంవత్సరం మేం తనిఖీలు నిర్వహించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని