logo

గర్భిణులకు వరం

సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం చెబుతోంది. గర్భిణులకు నమ్మకం కలిగించాలని సూచిస్తోంది.. అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తోంది.

Published : 02 Dec 2022 04:31 IST

 ప్రసూతి ఆసుపత్రిలో టిఫా సేవలు

నయీంనగర్‌, హనుమకొండ కలెక్టరేట్‌ న్యూస్‌టుడే

సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం చెబుతోంది. గర్భిణులకు నమ్మకం కలిగించాలని సూచిస్తోంది.. అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తోంది. కేసీఆర్‌ కిట్‌తో పాటు ఆడశిశువు జన్మిస్తే రూ.13వేలు, మగ శిశువుకు రూ.12వేలు ఇస్తోంది. తాజాగా టిఫా( టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫ్యూటల్‌ ఎనామిలీస్‌) అనే స్కానింగ్‌ యంత్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది గర్భిణులకు వరం లాంటిది. దీని ద్వారా కడుపులోని శిశువు ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చు.

జీఎంహెచ్‌లో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్‌ యంత్రం

హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన గర్భిణులు వైద్య సేవల నిమిత్తం వస్తుంటారు. నిత్యం ఓపీ 250 నుంచి 350 వరక ఉంటుంది. వైద్యులు పరీక్షించి సూచనలు చేస్తుంటారు. అదేవిధంగా ప్రతిరోజూ 20పైగా ప్రసవాలు జరుగుతుంటాయి. జీఎంహెచ్‌లో సాధారణ ప్రసవాలు పెంచేలా ఎప్పటికప్పడు ప్రభుత్వం వైద్యులను ప్రోత్సహిస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థికభారం పడకూడదని గర్భిణులకు ప్రధానంగా అవసరమయ్యే టీఫా స్కానింగ్‌ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. ఖరీదు రూ.30లక్షల వరకు ఉంటుంది.

తప్పనున్న ఆర్థిక ఇబ్బందులు

మారుతున్న కాలం, ఆహార అలవాట్లలో భాగంగా ప్రతి గర్భిణికి టీఫా స్కానింగ్‌ అనేది ప్రధానమైనది. గర్భం దాల్చిన 18 నుంచి 24 వారాల మధ్య తప్పనిసరిగా ఈ స్కానింగ్‌ చేెయించాలి. గతంలో సరైన స్కానింగ్‌ యంత్రం లేదు. దీంతో ప్రైవేటు స్కానింగ్‌ కేంద్రాలను ఆశ్రయించేవారు. ప్రైవేట్‌కు వెళ్తే రూ. 2 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రసూతి ఆసుపత్రిలో టీఫా స్కానింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక్కడ ఉచితంగా స్కానింగ్‌ చేస్తారు.

తెలుసుకునే విషయాలు..

స్కానింగ్‌ చేయడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. గర్భంలో శిశువు అవయవాలన్నీ ఒక్కొక్కటిగా పరిశీలిస్తారు. శిశువు ఎంత బరువు ఉంది? ఉమ్మనీరు సరిపడా ఉందా? లేదా? చిన్న మెదడు, పెద్ద మెదడు పనితీరు, గుండె సరిగా కొట్టుకుంటుందా.. ఏమైనా రంధ్రాలున్నాయా?, శిశువు కన్నులు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్లు సరిగా ఉన్నాయా? వెన్నుముక సరిగా ఉందా? లేదా? ఉపిరితిత్తులు సరిగా పనిచేస్తున్నాయా? లేదా అనేవి క్షుణ్నంగా వైద్యుడు పరిశీలించి నివేదిక అందిస్తారు,


బయట రూ.2వేలు తీసుకుంటున్నారు..

ఎ.పావని, ములుగు

నేను తొమ్మిది నెలల గర్భిణిని. ఇక్కడ గతంలో టీఫా స్కానింగ్‌ అందుబాటులో లేదు. ప్రైవేటులో స్కాన్‌ చేయించుకున్నాను. రెండు వేల రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ అందుబాటులోకి రావడంతో వైద్యుల సూచన మేరకు మరోసారి పరీక్ష చేయించుకున్నా. ఇది మాలాంటి పేదలకు ఉపయోగకరంగా ఉంటుంది.


చికిత్సతో నివారణ.

డా.ప్రవీణ్‌రెడ్డి, రేడియాలజిస్ట్‌

జిల్లాలో ఏటా ఎదో ఒక లోపంతో శిశువులు జన్మిస్తున్నారు. వీటిని అధిగమించడానికి టీఫా పరికరాలతో గర్భస్త దశలోనే పిండం లోపాలు గుర్తించి తగిన చికిత్స అందించవచ్చు. తల్లి, పుట్టబోయే శిశివుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.


ఆర్థికభారం తగ్గుతుంది

డా.విజయలక్ష్మి, జీఎంహెచ్‌ సూపరింటెండెంట్‌

ప్రభుత్వం పేదలకు ఆర్థికభారం కలగకుండా ఇటీవల టీఫా స్కానింగ్‌ను ఆసుపత్రిలో ఏర్పాటు చేసింది. నిత్యం 50 నుంచి 70 మంది గర్భిణులను పరీక్షిస్తున్నాం. ఇది వరకు  కేవలం అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ మాత్రమే ఉండేది. వాటితో ఇవి గుర్తించేందుకు వీలు పడేదికాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని