logo

మైనర్లు వాహనాలు నడపొద్దు

‘ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం.. యువకులు, కార్మికులు, మైనర్లు నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని’ భూపాలపల్లి మహిళా ఎస్సై డి.స్వప్న తెలిపారు.

Published : 02 Dec 2022 04:31 IST

భూపాలపల్లి టౌన్‌, భూపాలపల్లి, న్యూస్‌టుడే: ‘ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం.. యువకులు, కార్మికులు, మైనర్లు నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని’ భూపాలపల్లి మహిళా ఎస్సై డి.స్వప్న తెలిపారు. వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తే, చాలా వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆమె తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సై డి.స్వప్న

జిల్లా కేంద్రంలోని ఎల్బీనగర్‌ కాలనీలో తేజస్విని(గాంధీ) జూనియర్‌ కళాశాలలో గురువారం ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై స్వప్న మాట్లాడుతూ.. విద్యార్థులు చాలా మంది ఫోన్‌లో మాట్లాడుతూ.. ద్విచక్రవాహనాలను నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు.

భూపాలపల్లి ఏరియాలో కొద్ది నెలల క్రితం నుంచి జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే, మైనర్లు ద్విచక్రవాహనాలు నడిపిన కారణంగా జరిగినవే ఉన్నాయని అన్నారు. కొన్ని ప్రమాదాల్లో ఏకంగా ప్రాణాలు కోల్పోయారన్నారు. మైనర్లకు ద్విచక్రవాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, పిల్లలకు వాహనాలు ఇస్తున్న కొంత మంది కుటుంబ సభ్యుల కారణంగా ఇతరులకు పెద్ద నష్టం జరిగే అవకాశాలుంటాయని పేర్కొన్నారు.

విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న భూపాలపల్లి పోలీసులు

ప్రమాదాలకు కారణాలివే..

కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో యువత, విద్యార్థులు ద్విచక్రవాహనాలు నడిపే సమయంలో శిరస్త్రాణం ధరించడం లేదు.. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చేపడుతున్న వాహనాల తనిఖీల్లో ఈ విషయం తెలిసిందని ఎస్‌ఐ చెప్పారు.

విద్యార్థులు కొందరు గంజాయికి అలవాటుపడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే 100 నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించారు. 

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఎవరైనా విద్యార్థులు ద్విచక్రవాహనాలపై కళాశాలకు శిరస్త్రాణం లేకుండా వస్తే, కళాశాలలోకి వారికి అనుమతించకూడదని సూచించారు. 

త్రిబుల్‌ రైడింగ్‌ కూడా చట్టవిరుద్ధమే అవుతుంది. త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తున్న వారిని పోలీసులు గుర్తించి, వారిని ఆపడానికి ప్రయత్నిస్తే, మరింత వేగంతో వెళ్లి ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు.  * వాహనాలు మద్యం తాగి నడిపించకూడదని పేర్కొన్నారు.

లైసెన్సు తీసుకోండిలా..

అర్హులైన ప్రతి ఒక్కరూ మీ సేవ కేంద్రంలో లెర్నింగ్‌ లైసెన్సు కోసం మొదటగా దరఖాస్తు చేసుకోవాలి. కాలపరిమితి 6 నెలలు ఉంటుంది. కాలపరిమితిలోపు మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎంవీఐ) పరీక్ష నిర్వహించి, లైసెన్సు జారీ చేస్తారు. ఈ విషయం అందరికీ తెలిసినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. లైసెన్సు, ఆర్‌సీˆ కార్డు, బీమా, కాలుష్య సర్టిఫికెట్‌తో పాటు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలి. ఇవేమీ లేకుండా పోలీసులకు పట్టుబడితే విద్యార్థులు బంగారు భవిష్యత్తును కోల్పోతారు. ప్రమాదాలకు కారణమైతే జరిమానాతో పాటు జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. మైనర్లకు వాహనం ఇచ్చిన సదరు వాహనదారుడిపైనా కేసు నమోదు చేయాల్సి ఉంటుందని ఎస్సై వివరించారు. అనంతరం ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల ప్రిన్సిపల్‌ బిల్ల రాజిరెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ శ్రీమత, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని