logo

ప్రభుత్వ స్థలాలపై కన్ను

‘ప్రభుత్వ స్థలాలపై ప్రైవేటు వ్యక్తుల కన్నుపడింది. బల్దియా నుంచి అనుమతి పొందకుండానే ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు.

Published : 02 Dec 2022 04:53 IST

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

వరంగల్‌ బస్టాండ్‌ ఎదురుగా బల్దియా స్థలంలో కొనసాగుతున్న దుకాణాలు

‘ప్రభుత్వ స్థలాలపై ప్రైవేటు వ్యక్తుల కన్నుపడింది. బల్దియా నుంచి అనుమతి పొందకుండానే ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా, టౌన్‌ప్లానింగ్‌ విభాగం చూసీచూడనట్లుగా ఉంటోంది. ఇప్పటికే హనుమకొండ ప్రాంతంలోని రాయపుర, వడ్డేపల్లి టీచర్స్‌ కాలనీలో కోట్లాది రూపాయల విలువైన లేఅవుట్‌ ఖాళీ స్థలాలు ప్రైవేటు వ్యక్తుల అధీనంలో ఉన్నాయి. తాజాగా వరంగల్‌ బస్టాండ్‌ ఎదురుగా బల్దియాకు చెందిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు అద్దెకు ఇచ్చినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారమైతే ప్రభుత్వ స్థలాలు, నాలాలు, రోడ్లు, డ్రైనేజీలు, లేఅవుట్‌ ఖాళీ స్థలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలి. ప్రజావాణిలో ఆక్రమణలపై ఫిర్యాదులు పెరిగాయి. చర్యలు తీసుకునేందుకు గ్రేటర్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగం వెనుకంజ వేస్తోంది.’

అనధికార దుకాణాలు

పాత భవనాల తొలగింపులో భాగంగా గతేడాది వరంగల్‌ బస్టాండ్‌ ఎదురుగా గ్రేటర్‌ వరంగల్‌ షాపింగ్‌ కాంప్లెక్సు కూల్చేశారు. స్థలం ఖాళీగా ఉండటంతో అనధికార దుకాణాలు నడుస్తున్నాయి. కొందరు చిరు వ్యాపారులు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. 10-12 దుకాణాలు ఏర్పాటు చేశారు. వీరి నుంచి బల్దియా పేరుతో ప్రైవేటు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో వ్యాపారి నుంచి రోజూ రూ.500- 800 వరకు తీసుకుంటున్నారు.  కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని గ్రేటర్‌ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. గతంలో చేసిన పొరపాటు మళ్లీ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే 72, 73  స్థలాలకు సంబంధించి ప్రైవేటు వ్యక్తి బల్దియాపై రాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. ఇలాంటి ప్రమాదం స్టేషన్‌ పార్కు స్థలం పొంచి ఉందని సామాజిక కార్యకర్తలంటున్నారు.

మరికొన్ని ఉదాహరణలు

వరంగల్‌ ఎల్బీనగర్‌ ముస్లింల షాదీఖానా ఆవరణలో పురాతనమైన మంచినీళ్ల బావిని పూడ్చేశారు. ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతుందని సామాజిక కార్యకర్త లక్ష్మణ్‌ ఫిర్యాదు చేశారు. పది రోజులవుతున్నా ఎలాంటి చర్యల్లేవు.

వరంగల్‌ బస్టాండ్‌ ఎదురుగా బల్దియాకు చెందిన 1100 గజాల స్థలంపై ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు. నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక నిర్మాణాలు జరుగుతున్నాయి. చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు కమిషనర్‌ ప్రావీణ్యకు ఫిర్యాదు చేశారు.

హనుమకొండ ప్రాంతంలో దివ్యాంగులకు కేటాయించిన ప్రభుత్వ స్థలం వివాదాస్పదంగా మారింది.

హనుమకొండ నయీంనగర్‌ నాలా సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేసి భవన నిర్మాణం చేపడుతున్నా ఎలాంటి చర్యల్లేవు.

నగరంలోని పలు డివిజన్లలో అంతర్గత రోడ్డు స్థలాలు యథేచ్చగా ఆక్రమణలకు గురవుతున్నాయని రెండు రోజుల క్రితం ప్రజావాణిలో 23 ఫిర్యాదులు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని