logo

‘భాజపాది విద్రోహ యాత్ర’

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్నది పాదయాత్ర కాదని, విద్రోహ యాత్ర అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ విమర్శించారు.

Updated : 02 Dec 2022 06:52 IST

మాట్లాడుతున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌,

చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, మేయర్‌ సుధారాణి

రంగంపేట, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్నది పాదయాత్ర కాదని, విద్రోహ యాత్ర అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ విమర్శించారు. దీక్షా దివస్‌ ఉత్సవాల్లో భాగంగా గురువారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలేసి నివాళుర్పించి, దీక్ష దివస్‌ స్ఫూర్తి చిహ్నానికి గౌరవ వందనం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యమ చరిత్రను స్మరించుకుంటూ ఆలోచింపదగిన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీˆఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహర దీక్ష రాష్ట్ర సాధనలో మైలు రాయి అని గుర్తు చేశారు. భాజపాకు నలుగురు ఎంపీలున్నారని, వీరు ఏనాడైనా విభజన హమీలపై మాట్లాడారా? అని ప్రశ్నించారు. భాజపాతో దమ్మిడీ లాభం లేదని వినోద్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వైఎస్సార్‌ కుమార్తె షర్మిల పొర్లుదండాలు పెట్టినా ఇక్కడి ప్రజలు నమ్మరన్నారు. చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ మాట్లాడతూ దీక్షాదివస్‌ కార్యక్రమాలు 11 రోజులపాటు నిర్వహిస్తామని, డిసెంబరు 9న సీఎం కేసీఆర్‌ ఆమరణ దీక్ష పునరంకిత సభ నిర్వహిస్తామన్నారు. ప్రజల్లో విద్వేషాలు సృష్టించేందుకు పాదయాత్రలు చేపడుతున్నారని, తెలంగాణ ఉద్యమకారుడైన ఎమ్మెల్యే పెద్దిపై షర్మిల మాట్లాడిన తీరు సరైంది కాదన్నారు. మేయర్‌ సుధారాణి మాట్లాడుతూ తెలంగాణ వ్యతిరేకులను ప్రజలు తరిమి కొట్టాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రుణ విమోచన ఛైర్మన్‌ నాగూర్ల వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఎండీ.అజీజ్‌ఖాన్‌, మాజీ కుడా ఛైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని