logo

వ్యాధి లేకున్నా ఉన్నట్లు నిర్ధారణ!

హనుమకొండ చౌరస్తా కాకాజీకాలనీలోని ఓ ఆసుపత్రిలో వైద్యుడు.. లేని వ్యాధిని ఉందని నిర్ధారించి రెండు నెలల పాటు చికిత్స అందించి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ బాధిత బంధువులు శనివారం ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.

Published : 04 Dec 2022 04:47 IST

ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన

హనుమకొండ చౌరస్తా, న్యూస్‌టుడే : హనుమకొండ చౌరస్తా కాకాజీకాలనీలోని ఓ ఆసుపత్రిలో వైద్యుడు.. లేని వ్యాధిని ఉందని నిర్ధారించి రెండు నెలల పాటు చికిత్స అందించి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ బాధిత బంధువులు శనివారం ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. బాధితురాలి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపెండ్యాల గ్రామానికి చెందిన బాధిత మహిళ (60) రెండు నెలల కిందట కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చింది. వైద్యుడు పరీక్షలు జరిపి అపెండెసిస్‌ ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. ల్యాబ్‌లో రక్త పరీక్షలు నిర్వహించి ఆమెకు హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారిస్తారు. సదరు వైద్యుడు బాధితురాలి కుటుంబ సభ్యులతో ఈ విషయం చెప్పి జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సదరు వైద్యుడు రూ.1.50 లక్షలు తీసుకొని బాధితురాలికి ఆపరేషన్‌ చేస్తారు. రెండు నెలలుగా చికిత్స పొందుతున్న బాధితురాలు 10 రోజుల కిందట కాలికి గాయం కావడంతో చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి వచ్చి అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుంది. ఎంజీఎం వైద్యులు రక్తపరీక్ష చేసి ఆమెకు హెచ్‌ఐవీ లేనట్లు ధ్రువీకరిస్తారు. బాధితురాలి కుటుంబ సబ్యులు ఆమె రక్తాన్ని తీసుకొని మళ్లీ అదే ఆసుపత్రికి వచ్చి ల్యాబ్‌లో పరీక్ష చేయించగా హెచ్‌ఐవీ లేనట్లు ధ్రువీకరిస్తారు. ఇదే ఆసుపత్రిలో ఒకసారి హెచ్‌ఐవీ ఉన్నట్లు మరోసారి లేనట్లు చెప్పి తమ వద్ద వైద్య పరీక్షల పేరుతో డబ్బులు గుంజారని ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది బాధితురాలి కుటుంబసభ్యులపై దాడి చేసినట్లు తెలిసింది. స్థానికులు 100కు డయల్‌ చేయగా పోలీసులు వచ్చి వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఆసుపత్రిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. ఆసుపత్రి యాజమాన్యం వివరణ కోరగా హెచ్‌ఐవీ పరీక్షలు చేసిన కిట్‌ కంపెనీ వారికి రక్త పరీక్షలో తేడా ఎందుకు వచ్చిందని అడుగుతూ మెయిల్‌ చేశామని వారు అందించే రిపోర్ట్‌ను బట్టి నిర్ధారిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని