logo

ఆ యుద్ధ వినాశనం నుంచి వారసత్వ విధానం నేర్చుకున్నా

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంలో కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు కృషి ఎంతో ఉంది.  గుర్తింపు వచ్చాక ఆలయ సంస్కృతి చరిత్రపై భావి తరాలకు అవగాహన కల్పించే.

Published : 21 Jan 2023 04:58 IST

విశ్రాంత ఐఏఎస్‌ బీవీ పాపారావు

ఈనాడు, వరంగల్‌: రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంలో కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు కృషి ఎంతో ఉంది.  గుర్తింపు వచ్చాక ఆలయ సంస్కృతి చరిత్రపై భావి తరాలకు అవగాహన కల్పించే బాధ్యతనూ ఈ ట్రస్టు భుజానికెత్తుకుంది. వరంగల్‌ నగరంలో శనివారం రామప్ప ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రస్టు వ్యవస్థాపకుల్లో ఒకరైన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ప్రభుత్వ మాజీ సలహాదారు బీవీ పాపారావుతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. విశేషాలు ఆయన మాటల్లోనే.  

ఆ అనుభవంతోనే ట్రస్టు ఏర్పాటు

కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు ఏర్పాటై 14 ఏళ్లు కావస్తోంది. ఇందులో ఎన్‌ఐటీ విశ్రాంత ఆచార్యులు పాండురంగారావు వృత్తిరీత్యా జియో ఇంజినీర్‌ కావడంతో ఆయనకు సాంకేతికంగా ఆలయాల నిర్మాణంపై లోతైన అవగాహన ఉంది. నేను వారసత్వ పరిరక్షణ విధానంపై నైపుణ్యం సాధించానంటే దానికి కారణం 1999లో ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తూ ఆగ్నేయ ఐరోపాలోని కొసావోలో ఏడేళ్లపాటు సాంస్కృతిక విభాగంలో పనిచేయడమే. అంతకుముందు జరిగిన యుద్ధం వల్ల అక్కడ వందలాది ప్రార్థనాలయాలు, వారసత్వ కట్టడాలు నేలమట్టమయ్యాయి. వాటిని పునరుద్ధరించే బాధ్యతను నాకు అప్పగించారు. ఆ అనుభవంతోనే కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు ఏర్పాటుచేయాలనే ఆలోచన కలిగింది. అలా యుద్ధవినాశనం నుంచి వారసత్వ విధానం నేర్చుకున్నా.  

వచ్చే పదేళ్లలో మరిన్ని ఆలయాలను పరిరక్షిస్తాం

కాకతీయుల అద్భుత ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని నిర్మించింది శిలలతో కాబట్టి పునరుద్ధరణ సులువు. కాకపోతే పునర్నిర్మాణం చేసే అనుభవం ప్రయివేటు నిర్మాణ సంస్థలకు లేదు. ప్రభుత్వం డబ్బులు పెట్టినా అనుభవం ఉన్న వారు లేకపోతే వ్యర్థం. అందుకే కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు తరఫున మొదట కొన్ని ఆలయాలను పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాం. రామప్ప చెరువు కట్టపై శిథిలమైన ఆలయాన్ని బాగు చేసేందుకు రూ.4 కోట్లతో అంచనాలు సిద్ధం చేశాం.  ప్రభుత్వం, హెరిటేజ్‌ ట్రస్టు ద్వారా నిధులు సేకరించి దీన్ని నిర్మిస్తాం. ఇలా వచ్చే పదేళ్లలో అనేక వారసత్వ కట్టడాలను పునరుద్ధరిస్తాం.

కోణార్క్‌, ఖజురహో తరహాలో..

రామప్ప ఆలయం ఇక అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సందర్శకుల సంఖ్య అయిదు రెట్లు పెరిగింది. ఇప్పుడున్న కాటేజీలు సరిపోవు. మరిన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విదేశీ పర్యాటకులు బస చేసేందుకు వరంగల్‌లో అయిదు లేదా నాలుగు నక్షత్రాల హోటల్‌ను ప్రభుత్వం నిర్మించనుంది. రామప్పకు గుర్తింపు దక్కినప్పటి నుంచి అనేక కార్యక్రమాలు ట్రస్టు తరఫున చేపట్టాం. అనేక పుస్తకాలు ముద్రిస్తున్నాం. ఇప్పుడు రామప్ప ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశాం. ఖజురహో, కోణార్క్‌లో నృత్య వేడుక మూడు రోజుల పాటు జరుపుతారు. ఈ ఏడాది ప్రముఖ నృత్యకారిణి మల్లికాసారాభాయ్‌ను తీసుకొచ్చాం. ఈ ఏడాది ఒక్క రోజుపాటు జరిపే వేడుక వచ్చే ఏడాది నుంచి రామప్పలో మూడు రోజులపాటు చేస్తాం.

* ఓరుగల్లు బిడ్డగా కాకతీయ ఆలయాల సంరక్షణ కోసం పాటు పడే అవకాశం రావడం నాకెంతో గర్వకారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని