logo

శిరస్త్రాణం.. రక్షణాస్త్రం!!

చాలా మంది ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో హెల్మెట్‌ను వెంట తెచ్చుకుంటున్నారు. వాటిని బండికి తగిలించుకొని వెళ్తున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తున్నారని తెలిస్తేనే ధరిస్తున్నారు. లేదంటే అంతే. దీని వలన  ఉపయోగం లేదు.

Published : 23 Jan 2023 03:48 IST

న్యూస్‌టుడే, వరంగల్‌క్రైం

చాలా మంది ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో హెల్మెట్‌ను వెంట తెచ్చుకుంటున్నారు. వాటిని బండికి తగిలించుకొని వెళ్తున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తున్నారని తెలిస్తేనే ధరిస్తున్నారు. లేదంటే అంతే. దీని వలన  ఉపయోగం లేదు.

విధించిన ఈ-చలాన్లు 
జరిమానా(రూ.)

ట్రాఫిక్‌ ఠాణాల  పరిధిలో గతేడాదిలో హెల్మెట్‌ ఉల్లంఘనలు..
హనుమకొండ:  3,58,929  6,41,16,600  
వరంగల్‌ : 2,69,437 4,75,12,500
కాజీపేట  : 2,87,966 5,11,79,100

ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. ఇంటి పెద్ద, చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. ద్విచక్రవాహనం నడిపే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శిరస్త్రాణం ధరించాలి. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. హెల్మెట్‌ ధరించడం భారంగా అనుకోవద్దు.. బాధ్యతగా భావించాలి.

కుర్రకారు రయ్‌మని దూసుకుపోతున్నారు. కొంత మంది శిరస్త్రాణాన్ని భారంగా భావిస్తున్నారు. జుట్టు ఊడిపోతుందని, ముఖం పాలిపోతుందని అనుకొని ధరించడం మానేశారు. జరిమానాల నుంచి తప్పించుకోవడానికి నెంబర్‌ ప్లేట్లు లేకుండా, ఉన్న వాటిని కనిపించకుండా చేస్తున్నారే తప్ప హెల్మెట్‌ ధరిద్దామని ఆలోచన చేయడం లేదు.

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో జరుగుతున్న ద్విచక్రవాహనాల ప్రమాదాల్లో 60 శాతం మృతి చెందుతున్నారని పోలీసుల నివేదికలు చెబుతున్నాయి. గతంలో వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. చిన్నపిల్లలతో పుష్పాలు ఇప్పించి.. ధరించమని చెప్పించారు. డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేసి హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల జరిగే నష్టాలను సైతం వివరించారు.అయినా కొంతమంది మాత్రం ధరించడం లేదు.

గతేడాది హనుమకొండ, వరంగల్‌, కాజీపేట ట్రాఫిక్‌ ఠాణాల పరిధిలో హెల్మెట్లు లేకుండా తిరుగుతున్న 9,16,332 మందికి ఈ-చలాన్లు ద్వారా రూ.16.28 కోట్ల జరిమానా విధించారు. పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


తలకు గాయమైతే..

రీరంలో కీలకమైనది మెదడు. ఇది ఇచ్చే సంకేతాలతోనే అవయవాలు పనిచేస్తుంటాయి. మెదడు కణజాలంతో కూడిన పొరతో కప్పబడి ఉంటుంది. దానిపై రక్షణగా పుర్రె ఉంటుంది. ప్రమాదంలో మెదడుకు గాయమైతే జీవితంలో అన్ని కోల్పోవాల్సి వస్తుంది. తలకు గాయాలు కాకుండా చూసుకోవాలి.


స్వల్ప గాయాలతో బయటపడ్డా

దామోదర్‌రెడ్డి గోపాల్‌పూర్‌

నెల రోజుల క్రితం రాత్రి పూట వ్యక్తిగత పనిపై బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నా. గోపాల్‌పూర్‌ ప్రధాన రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో కింద పడ్డాను. హెల్మెట్‌ ఉండడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాను. అదే లేకుంటే తలకు బలమైన గాయమయ్యేది.


చాలా సురక్షితం

శ్రీధర్‌, హనుమకొండ

హెల్మెట్‌ ఉపయోగం తెలుసుకొని ధరిస్తున్నా. ఈనెల 8వ తేదీన రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుడు తల రోడ్డుకు తాకింది. కానీ ఏమీకాలేదు. చేతులు, కాళ్లకు దెబ్బలు తగిలాయి. హెల్మెట్‌ లేకుంటే తలకు గాయం అయ్యేది.


నాణ్యమైనవి కొనుగోలు చేయాలి

మధుసూదన్‌, ట్రాఫిక్‌ ఏసీపీ

వాహనదారులు నాణ్యమైన హెల్మెట్‌ను వాడాలి. దీని వల్ల తలకు పూర్తి రక్షణ లభిస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో స్వల్ప గాయాలతో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయమై చాలా సార్లు వాహనదారులకు అవగాహన కల్పించాం. ఈ చలాన్లు విధిస్తున్నాం. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఇలాంటి వారికి కుటుంబ సభ్యులే చెబితే మంచిగా ఉంటుంది.

గతేడాది ద్విచక్ర వాహన ప్రమాదాలు: 390
గాయపడిన వారు: 536
మృతులు: 218

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని