logo

వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి

వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కూతురు మరణించిందని ఆరోపిస్తూ.. వరంగల్‌లోని ఓ ఆసుపత్రి ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.

Published : 26 Jan 2023 04:33 IST

ఆసుపత్రి ఎదుట మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన

లేబర్‌కాలనీ, న్యూస్‌టుడే: వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కూతురు మరణించిందని ఆరోపిస్తూ.. వరంగల్‌లోని ఓ ఆసుపత్రి ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన ఓ బాలిక (15) తల్లితండ్రులు మందలించడంతో మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. వైద్యం వికటించి మృతిచెందిందని, ఆసుపత్రి ఐసీయూ విభాగంపై దాడికి దిగారు. దవాఖానా ముఖద్వారం వద్ద ఉన్న పూలకుండీలను ధ్వంసం చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న మిల్స్‌కాలనీ పోలీసులు ఆందోళన కారులతో మాట్లాడి శాంతించాలని కోరారు.

ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చాం..: మృతిపై ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇచ్చింది. మంగళవారం ఉదయం అపస్మారక స్థితిలో బాలికను ఆసుపత్రికి తీసుకొచ్చారని, కొన ఊపిరితో ఉన్న ఆమెకు వైద్య నిపుణుల బృందం చికిత్స అందించిందన్నారు. బుధవారం మధ్యాహ్నం మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించామని, మరణానికి ఆసుపత్రి తప్పిదం లేదని పేర్కొన్నారు.

ఇరువర్గాలపై కేసు: రంగశాయిపేట: వైద్యులు చనిపోయిన తరువాతనే తమ కుమార్తెకు చికిత్సలు చేశారని ఆరోపిస్తూ బాలిక తండ్రి మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కుటుంబ సభ్యులు ఆస్పత్రిపై దాడి చేశారు. దీంతో ఆస్పత్రి నిర్వాహకులపై, దాడికి పాల్పడిన మృతురాలి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని