logo

ప్రైవేటులో కష్టమన్నారు.. నిమ్స్‌లో ప్రాణం పోశారు

ఆ యువతికి పుట్టుకతోనే గుండె సమస్య ఉంది. మూడేళ్ల వయసులోనే ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేసి సరిచేశారు. నాలుగేళ్ల నుంచి ఆ యువతికి గుండెలో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

Updated : 29 Jan 2023 13:09 IST

జాహ్నవితో వైద్యులు మెడికల్‌ సూపరింటెండెంట్‌ నిమ్మ సత్యనారాయణ, హృద్రోగ నిపుణులు డాక్టర్‌ సాయి సతీష్‌, నిమ్స్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌:  ఆ యువతికి పుట్టుకతోనే గుండె సమస్య ఉంది. మూడేళ్ల వయసులోనే ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేసి సరిచేశారు. నాలుగేళ్ల నుంచి ఆ యువతికి గుండెలో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. తల్లిదండ్రులు పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించగా చికిత్స చేసినా భరోసా ఇవ్వలేమని వారు చెప్పారు. ఆఖరి ప్రయత్నంగా నిమ్స్‌ వైద్యులను సంప్రదించగా వారు పునర్జన్మ ప్రసాదించారు. శనివారం నిమ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిమ్స్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ, కార్డియాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సాయి సతీష్‌ వివరాలు వెల్లడించారు. జయశంకర్‌ భూపాలపల్లికి చెందిన రాంబాబు, సుజాత దంపతుల కుమార్తె జాహ్నవికి పుట్టుకతోనే గుండెపై భాగంలో రంధ్రం(ఏఎస్‌డీ)తోపాటు గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల వద్ద వాల్వు కూడా దెబ్బతింది. 3 ఏళ్ల వయసులో ఆమెకు వైద్యులు బైపాస్‌ సర్జరీ చేసి సరిచేశారు. ప్రస్తుతం 16 ఏళ్ల బాలిక నాలుగేళ్లుగా ఆయాసం, ఇతర సమస్యలతో బాధపడుతోంది. తల్లిదండ్రులు పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో సంప్రదించగా చాలా క్లిష్టమైన సమస్య అని.. రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని, అయినా హామీ ఇవ్వలేమన్నారని సదరు వైద్యులు తల్లిదండ్రులకు వివరించడంతో వారు యువతిని నిమ్స్‌లో చేర్పించారు. రంగంలోకి దిగిన డాక్టర్‌ సాయి సతీష్‌ ఇతర వైద్య బృందం వివిధ రకాల పరీక్షల చేసి యువతి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశారు. గుండెలో రంధ్రం కారణంగా మంచి రక్తంలోకి చెడు రక్తం వచ్చి కలుస్తున్నట్లు గుర్తించారు. అదేవిధంగా పల్మనరీ వాల్వు దెబ్బతినడం వల్ల గుండె నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే రక్తం తిరిగి వెనక్కి వస్తున్నట్లు తేల్చారు. దీంతో రక్తంలో ఆక్సిజన్‌ తగ్గిపోయి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించారు. మళ్లీ ఓపెన్‌ హార్టీ సర్జరీ చేస్తే ప్రాణాలకే ప్రమాదమని గుర్తించి కాలి నరం నుంచి క్యాథిటర్‌ ద్వారా ఏఎస్‌డీ పరికరంతోపాటు కృత్రిమ వాల్వు పరికరం పంపి.. రెండు సమస్యలకు ఒకేసారి చికిత్స చేశామని వైద్యులు వివరించారు. నిమ్స్‌ చరిత్రలోనే ఈ తరహా శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారని డా.సాయి సతీష్‌ వివరించారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో రెండు, మూడు మాత్రం ఇలాంటి సర్జరీలు జరిగాయన్నారు. రెండున్నర గంటలపాటు శస్త్రచికిత్స చేసినట్లు చెప్పారు. యువతి పూర్తిగా కోలుకుందని రెండు రోజుల్లో డిశ్ఛార్జి చేస్తామన్నారు. ఇందుకు రూ.14 లక్షల వరకు ఖర్చు అయిందని యవతి తండ్రి సింగరేణి ఉద్యోగి కావడంతో పూర్తి బీమా కింద చికిత్స అందినట్లు చెప్పారు. జాహ్నవి మాట్లాడుతూ తనకు తిరిగి జీవితాన్ని ఇచ్చిన వైద్యుల స్ఫూర్తితో తాను కూడా డాక్టర్‌ను అవుతానని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని