logo

ఆగిన చోటే.. అడుగేసి

వైతెపా అధ్యక్షురాలు షర్మిల పాద యాత్ర వరంగల్‌ జిల్లాలో ఆగిన చోటి నుంచే పునఃప్రారంభమైంది.

Updated : 03 Feb 2023 06:37 IST

ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల

ఈనాడు, వరంగల్‌, చెన్నారావుపేట, నెక్కొండ, న్యూస్‌టుడే: వైతెపా అధ్యక్షురాలు షర్మిల పాద యాత్ర వరంగల్‌ జిల్లాలో ఆగిన చోటి నుంచే పునఃప్రారంభమైంది. గురువారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ నుంచి బయలుదేరిన షర్మిల సాయంత్రం 4 గంటలకు వైతెపా ముఖ్య నేతలతో వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరమ్మతండా వద్దకు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు ఆమెపై పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అక్కడే తన వెంట తెచ్చిన వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించారు. నవంబరు 28న.. 223వ రోజు షర్మిల పాదయాత్రను భారాస నేతలు అడ్డుకోవడంతో యాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. తర్వాత యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రెండు నెలలకు పైగా బ్రేక్‌ పడింది. యాత్రకు అనుమతి కోసం షర్మిల న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి పొందారు. సుదీర్ఘ విరామం తర్వాత గురువారం 224వ రోజు యాత్ర ప్రారంభమైంది.


భారీ బందోబస్తు..

ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా వరంగల్‌ పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ, ముగ్గురు ఏసీపీల నేతృత్వంలో 8 మంది సీఐలు, 15 మంది ఎస్‌ఐలతోపాటు మొత్తం వంద మంది పోలీసు సిబ్బంది యాత్రకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. యాత్ర గురువారం రాత్రి వరకు నెక్కొండ మండల కేంద్రానికి చేరుకొంది. లింగగిరి క్రాస్‌ వద్ద షర్మిల వైఎస్‌ విగ్రహానికి పూల మాల వేసి ప్రభుత్వంపై పదునైన విమర్శలు గుప్పిస్తూ ప్రసంగించారు. అనంతరం నెక్కొండ మండల కేంద్రంలో ‘మాటా ముచ్చట’ పేరుతో ప్రజలతో సంభాషించారు.


ఏదీ బంగారు తెలంగాణ?

నెక్కొండ మాటా ముచ్చటలో షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పదునైన విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్‌ తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేశారన్నారు.  ఎనిమిదిన్నరేళ్లలో ప్రతిపక్షాలు ప్రజల కోసం కేసీఆర్‌ను ఎదురించి మాట్లాడలేదని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ వల్ల ప్రజలకు ఇబ్బందులే తప్ప లాభాలు లేవన్నారు. తెలంగాణ ప్రజల కోసమే నా కుటుంబాన్ని పిల్లల్ని వదిలి పెట్టి వచ్చానని షర్మిల అన్నారు. పాదయాత్రలో వైతెపా నేతలు శాంతికుమార్‌, రాజశేఖర్‌, వెంకన్న, దినేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


మహిళకు సన్మానం..

నెక్కొండ, చెన్నారావుపేట, న్యూస్‌టుడే: గతేడాది నవంబర్‌ 28 షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను భారాస నేతలు అడ్డుకున్నారు. లింగగిరి క్రాస్‌రోడ్డులో ఉన్న వైఎస్సార్‌ విగ్రహాన్ని కొందరు దహనం చేయడానికి ప్రయత్నించారు. లింగగిరికి  చెందిన పులి మంజుల వారిని అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలు పోయడంతో విగ్రహం అంటుకోగా ఆమెతో పాటు మరికొందరు మహిళలు  నీళ్లు పోసి మంటలను ఆర్పివేశారు. గురువారం పునఃప్రారంభమైన పాదయాత్రలో భాగంగా లింగగిరి క్రాస్‌రోడ్డుకు చేరుకున్న షర్మిల మంజులను శాలువాతో సన్మానించారు.

నెక్కొండలో పాదయాత్రకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని