logo

గళమెత్తండి.. పరిష్కారం చూపండి

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా పరిధిలోని తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లోని సమస్యలను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాలని శుక్రవారం ‘ఈనాడు’ అవకాశం కల్పించింది.

Published : 04 Feb 2023 06:08 IST

ఎమ్మెల్యేలకు ప్రజల నివేదన
-కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా పరిధిలోని తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లోని సమస్యలను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాలని శుక్రవారం ‘ఈనాడు’ అవకాశం కల్పించింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యల చిత్రాలు, వివరాలను పంపించారు. వరంగల్‌ తూర్పు, నర్సంపేట ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. 

ముంపు సమస్య తీర్చాలి..

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే:  వర్షాకాలంలో  వరంగల్‌ నగర పరిధిలో కాలనీలు నీట మునుగుతున్నాయి. వరదనీరు సాఫీగా నగరం దాటేలా శాశ్వతంగా వరదనీటి కాల్వలు  ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరారు.  వరంగల్‌ తూర్పు కేంద్రంగా వరంగల్‌ జిల్లా సమీకృత కలెక్టరేటు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలు ఇలా ఉన్నాయి..

* హంటర్‌రోడ్‌ బొందివాగు నాలా వరదనీటితో గత 15 ఏళ్లుగా కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించాలి

మర్రి రవీందర్‌, హంటర్‌రోడ్‌, బృందావన్‌ కాలనీ


* రంగశాయిపేట ప్రభుత్వ డీగ్రీ కళాశాలకు శాశ్వత భవనం నిర్మించాలి. తూర్పులోని అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించి భవనాలు కట్టాలి. ఉర్సు ప్రసూతి ఆసుపత్రిని పూర్తిస్థాయిలో నడిపించాలి, వైద్యులను నియమించాలి. 

మండల  పరుశరాములు, సామాజిక కార్యకర్త, రంగశాయిపేట


* వరంగల్‌ జిల్లా నూతన సమీకృత కలెక్టరేటు భవన నిర్మాణ పనులు ప్రారంభించాలి. కలెక్టర్‌, ప్రభుత్వ కార్యాలయాలు హనుమకొండలో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మీసాల ప్రకాశ్‌, వరంగల్‌


* భద్రకాళి చెరువు బండ్‌ సమీపంలో గాయత్రి, సాయినగర్‌, బృందావన్‌, ఎన్టీఆర్‌నగర్‌,  సంతోషిమాత కాలనీలున్నాయి. ఫుల్‌ ట్యాంకు లెవల్‌(ఎఫ్‌టీఎల్‌) నిబంధనల పేరుతో భవన నిర్మాణ అనుమతులు, అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. నిబంధనలు సడలించాలి 

ఎం.రాజేష్‌కుమార్‌, వ్యాపారి, సంతోషిమాత కాలనీ


* రంగశాయిపేట నాయుడు పంపు కూడలి నుంచి ఆరెపల్లి వరకు సుమారు 8 కిలో మీటర్ల పరిధిలో 200 అడుగుల ఇన్నర్‌ రింగురోడ్డు పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నరవుతున్నా ఇంత వరకు పనులు మొదలవ్వలేదు.

స్థానికులు


వరంగల్‌-ఖమ్మం 563 జాతీయ రహదారి అధ్వానంగా ఉంది. గుంతలు, గతుకులతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్‌ నూతన బస్టాండ్‌ నిర్మాణ పనులు తొందరగా ప్రారంభించాలి

స్థానికులు


వరంగల్‌ నగర పరిధిలో 300 మంది కిరోసీన్‌ హాకర్లు ఉన్నారు. గత 30 ఏళ్లుగా దీనిపైనే జీవనోపాధి పొందాం. కిరోసీన్‌ నిలిపివేయడంతో ఉపాధి కోల్పోయాం. ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి.

వై.సాంబయ్య, శివనగర్‌, రాష్ట్ర కిరోసీన్‌ హాకర్ల సంఘం అధ్యక్షుడు


* శివనగర్‌ పల్లవి ఆసుపత్రి రోడ్డులో మూడేళ్లుగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైయినేజీ పనుల పేరుతో తాగునీటి సరఫరా బంద్‌ అయింది. మురుగునీరు ముందుకెళ్లడం లేదు. కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసంపూర్తిగా మిగిలిన పనులు పూర్తి చేయాలి.

పొన్నా హరినాథ్‌, శివనగర్‌


ప్రధాన సమస్యలు పరిష్కరిస్తా..
-నన్నపునేని నరేందర్‌, ఎమ్మెల్యే వరంగల్‌ తూర్పు

గత శాసనసభ సమావేశాల్లో ముఖ్యమైన సమస్యలపై మాట్లాడాను. ఈసారి కూడా సభ దృష్టికి తీసుకెళ్తాను. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి.

* తూర్పులో ముంపు సమస్య ల్లేకుండా శాశ్వత పనులు జరుగుతున్నాయి.

* హంటర్‌రోడ్‌ బొందివాగు నాలా విస్తరణ, అభివృద్ధి పనులకు రూ.147 కోట్లతో డీపీఆర్‌ సిద్ధమైంది. నిధుల అంశంపై శాసనసభలో మాట్లాడుతాను.

* భద్రకాళి చెరువు ఎఫ్‌టీఎల్‌ నిబంధనల సడలింపు ఉత్తర్వులు వస్తాయి.

* ఇన్నర్‌ రింగురోడ్డు భూసేకరణ ఇంకా కొనసాగుతుంది. వీలైనంతా తొందర్లో పనులు ప్రారంభమయ్యేలా చూస్తా. రూ.50 కోట్ల నిధులు ఉన్నాయి

* పట్టణ ఆరోగ్య కేంద్రాలకు శాశ్వత భవనాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.


సారూ.. ఇవీ మా సమస్యలు

నర్సంపేట, న్యూస్‌టుడే:  నియోజకవర్గంలో మండలాలవారీగా పలు సమస్యలను ప్రజలు ప్రస్తావించారు. రహదారుల నిర్మాణం, కరెంటు కోతలు, తాగునీటి సరఫరా వంటివి వెంటనే తీర్చాలని కోరారు. వీటికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలు ఇలా ఉన్నాయి..

* మండల కేంద్రమైన చెన్నారావుపేట నుంచి ఉప్పరపల్లి వరకున్న బీటీ రోడ్డుపై కంకర చూర పోసి వదిలేశారు. దీంతో దుమ్ముతో ఇబ్బంది పడుతున్నాం. వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలి?

పి.రాము, మరో ఇద్దరు యువకులు, ఉప్పరపల్లి

ఎమ్మెల్యే: తారు రోడ్డు టెండర్‌ పూర్తయ్యాయి. సంబంధిత అధికారులు, గుత్తేదారుతో మాట్లాడి నిర్మాణం పనులు తొందర్లోనే చేపడుతాం.


* నర్సంపేట మండలం మాధన్నపేట పెద్ద చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌గా ఎప్పుడు నిర్మిస్తారు?

కొర్ర శోభన్‌బాబు, సహాయ ప్రొఫెసర్‌, పర్శునాయక్‌తండ

ఎమ్మెల్యే: మిషన్‌ కాకతీయలో రాష్ట్రంలో మొదటి మినీ ట్యాంక్‌ బండ్‌ కోసం నిధులు మంజూరు చేయించాను. అప్పట్లో పనులు తీసుకున్న గుత్తేదారు పనులు చేయకుండా మధ్యలో వదిలేశాడు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా నిధుల మంజూరుకు డీపీఆర్‌ తయారు చేసి పంపాను. త్వరలో నిధులు మంజూరవుతాయి


* అప్రకటిత కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కల్‌చెడ గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించండి-?

పులిశేరు రాజేందర్‌, అక్కల్‌చెడ

ఎమ్మెల్యే: ఇటివలే విద్యుత్తు అధికారులతో సమీక్షించి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న కరెంటు పనులు చేయిస్తున్నాం. నాలుగు రోజుల్లో నాణ్యమైన 24 గంటల విద్యుత్తు సరఫరా అవుతోంది. గతంలో వేసిన కిలో మీటర్ల కంటే సీసీ రోడ్లు మంజూరు చేయించాను


* నల్లబెల్లి మండల కేంద్రంలో మిషన్‌ భగీరథ పనులు ఇంకా పూర్తి కాలేదు. కొన్ని ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చినా నీళ్లు రాక కుళాయిలు అలంకార ప్రాయంగా మారాయి?

ఎస్‌.రామకృష్ణ, నల్లబెల్లి.

ఎమ్మెల్యే: గుత్తేదారుల నిర్లక్ష్యంతో అక్కడక్కడ ఆగిపోయిన పనులు తొందర్లోనే చేయిస్తాం. ఇప్పటికే దీనిపై అధికారులతో మాట్లాడాను. పాలేరు ప్రాజెక్టుకు టెయిలెండ్‌ నర్సంపేట నియోజకవర్గం. చివరిది నల్లబెల్లి మండలం కావడంతో నీళ్లు సరిగా రావడం లేదు.అధికారులతో సమీక్షించి సమస్యను పరిష్కరిస్తాను.


* దళితులందరికి దళితబంధు పథకం మంజూరు చేయాలి..

ఎస్సీ యువకుడు, చెన్నారావుపేట

ఎమ్మెల్యే: దళితబంధు నియోజకవర్గానికి వంద యూనిట్లు మంజూరు కాగా పంపిణీ చేశాము. రెండో సారి ప్రభుత్వం మంజూరు చేయగానే అర్హులకు అందజేస్తాం.


* నెక్కొండలో డిగ్రీ కళాశాల లేనందున బాలికలు ఇంటర్‌తో విద్యకు స్వస్తి చెబుతున్నారు?

ఈదునూరి సురేశ్‌, నెక్కొండ

ఎమ్మెల్యే: నెక్కొండలో డిగ్రీ కళాశాల నెలకొల్పేందుకు తప్పకుండా పని చేస్తాను


* నెక్కొండ పీహెచ్‌సీలో 24 గంటలు వైద్యం అందేలా ఉన్నతీకరించా..

ఈదునూరి శివాజీ, నెక్కొండ

ఎమ్మెల్యే: ఇప్పుడున్న పీహెచ్‌సీలో 24 గంటల వైద్యం అందించే ఆసుపత్రిగా ఉన్నతీకరించాలంటే ప్రస్తుతమున్న ఓపీ సంఖ్య సరిపోవడం లేదు. ఆసుపత్రిలో ఓపీ సంఖ్య పెరిగితే 24 గంటల వైద్యం అందించేలా ఉన్నతీకరిస్తాం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు