logo

కొలువుల నియామకాల్లో చేతివాటం

ప్రభుత్వ సంస్థల్లో పొరుగుసేవల పద్ధతిన పనిచేసే సిబ్బంది నియామకాల్లో ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలను పాతరేశారు.

Published : 04 Feb 2023 06:08 IST

గార్ల సామాజిక ఆరోగ్య కేంద్రం

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, గార్ల: ప్రభుత్వ సంస్థల్లో పొరుగుసేవల పద్ధతిన పనిచేసే సిబ్బంది నియామకాల్లో ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలను పాతరేశారు. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న నిర్వాహకులు కొలువును అమ్ముకున్నారు. ఉద్యోగం పొందిన వారికి నుంచి దండుకున్నారు. సొమ్ము చెల్లించిన తరువాతనే కొలువు పత్రాలను అందించారు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. విషయం తెలిసిన సంబంధిత అధికారులు ఏజెన్సీపై చర్యలు తీసుకోకుండా మామూళ్లు తీసుకుని పరోక్షంగా వారికి మద్దతిచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రూ.50 వేల నుంచి వసూలు

జిల్లాలోని గార్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో పొరుగుసేవల విధానంలో పనిచేసేందుకు 13 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఏడుగురిని శానిటేషన్‌ విభాగానికి, ముగ్గురిని పేషంట్‌ కేర్‌, మరో ముగ్గురిని సెక్యూరిటీ విభాగంలో పనిచేసేందుకు నియమించారు. సుమారు 10 మందికి నియామక పత్రాలిచ్చేందుకు మహబూబాబాద్‌లోని ఓ పొరుగుసేవల ఏజెన్సీ నిర్వాహకుడు ఒక్కొక్కరి నుంచి డబ్బులు తీసుకున్న తర్వాతనే ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించారని తెలిసింది. అప్పులు చేసి కొలువు కొనుక్కున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా డబ్బులు సమర్పించుకున్నారు. రూ. 50 వేల నుంచి రూ.1.20 లక్షలు ఇచ్చిన వారున్నారు. ఈ 13 మందిలో కొందరిని గతేడాది నవంబరులో.. మిగతా వారిని ఈ ఏడాది జనవరిలో నియమించినట్లు సమాచారం. ప్రతి నెల వీరికి రూ.15 వేలు కాగా, మొదటి నెల జీతంగా రూ.11వేలు చెల్లించినట్లు, ఈపీఎఫ్‌ కింద రూ.2 వేలు, ఏకరూప దుస్తులు, ఇతర వాటికి రూ.2వేలు కోత పెట్టారని సిబ్బంది ఒకరు చెప్పారు.  

డబ్బులు తీసుకున్నట్లు తెలియదు

డాక్టర్‌ బి.వెంకట్రాములు, సూపరింటెండెంట్‌

పొరుగు సేవల సిబ్బంది నియామకాల్లో డబ్బులు తీసుకున్నట్లు తెలియదు. నోటిఫికేషన్‌ జారీ చేసిన సమయంలోనే ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని అవగాహన కల్పించాం. దరఖాస్తు చేసే సమయంలో కూడా ఎవరికైనా డబ్బులు ఇసున్నారా అని కూడా అడిగాం. నియామకాలు పూర్తయిన తర్వాత మళ్లీ అడిగాం. డబ్బులు ఎవరికి ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు