logo

భయపడేది లేదు.. ప్రజల్లో తేల్చుకుందాం

చేసిన తప్పులు, అక్రమాలు, అవినీతిపై మాట్లాడినందుకే భారాస నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

Updated : 05 Feb 2023 06:27 IST

మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే రమేష్‌కు వైఎస్‌ షర్మిల సవాల్‌

మాటా ముచ్చట కార్యక్రమంలో మాట్లాడుతున్న షర్మిల

పర్వతగిరి, న్యూస్‌టుడే: చేసిన తప్పులు, అక్రమాలు, అవినీతిపై మాట్లాడినందుకే భారాస నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ తమ వర్గీయులను దించారని మండిపడ్డారు. ఎవరికీ భయపడేది లేదని, విమర్శలు వాస్తవం కాకుంటే ప్రజల సమక్షంలో కూర్చొని తేల్చుకుందాం రండి అంటూ సవాలు విసిరారు. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామ శివారు జానకిపురం నుంచి శనివారం ప్రజా ప్రస్థాన పాదయాత్ర ప్రారంభించారు. అంతకు ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పాదయాత్రను అడ్డుకోవడానికి భారాస శ్రేణులు కుట్రలకు పాల్పడుతున్నాయని.. కవరేజీ కోసం వచ్చిన మీడియాపైనా దాడులకు దిగడం సిగ్గు చేటన్నారు. స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించడం, మంత్రి స్వగ్రామంలో కనీసం 24 గంటల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల లేకపోవడం, బిల్లులు రాక సర్పంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాట్లాడడమే తప్పు అన్నట్లుగా మంత్రి, ఎమ్మెల్యేల అనుచరులు తమ ప్లెక్సీలు, చింపి, దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు వారిపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. భారాస నేతల ఆటలు ఇక సాగబోవని.. పాలన చాతకాక తమపై దాడులు చేయడానికి చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం సంభవించిన నూతన సచివాలయాన్ని పరిశీలించేందుకు అఖిలపక్షం నాయకులకు అనుమతి ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయమెందుకో అర్థం కావడం లేదని.. తప్పును కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పర్వతగిరి, సంగెం మండలాల్లో పాదయాత్ర కొనసాగించారు.

ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు: సంగెం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో ధనిక రాష్ట్రంగా ఉండగా నేడు ముఖ్యమంత్రి కేసీˆఆర్‌ నాలుగు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం పర్వతగిరి మండలం చౌటపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించి సంగెం మండలం తీగరాజుపల్లి, గవిచర్ల, కాపులకనపర్తి గుంటూరుపల్లి మీదుగా పాదయాత్ర చేసి ఖిలావరంగల్‌ మండలం నక్కలపల్లి వద్ద రాత్రి విడిది చేశారు. కాపులకనపర్తి వద్ద షర్మిలక్కతో మాటా ముచ్చట కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  ఓటు విలువైందని మీ అమూల్యమైన ఓటును మాయమాటలకు మోసపోయి దుర్వినియోగం చేసుకోవద్దన్నారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ రాజ్యం స్థాపనే తన లక్ష్యమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని