logo

నర్సంపేటలోనూ అసమ్మతి కుంపటి!

పురపాలికల పాలకవర్గాల మూడేళ్ల గడువు తీరిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజుకుంటున్న అసమ్మతి కుంపటి వరంగల్‌ జిల్లా నర్సంపేట పురపాలికకూ అంటుకుంది.

Published : 05 Feb 2023 05:59 IST

నర్సంపేట, న్యూస్‌టుడే: పురపాలికల పాలకవర్గాల మూడేళ్ల గడువు తీరిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజుకుంటున్న అసమ్మతి కుంపటి వరంగల్‌ జిల్లా నర్సంపేట పురపాలికకూ అంటుకుంది. పాలకవర్గంలో కొంత మంది కౌన్సిలర్లను కూడగట్టి అసమ్మతి రాజేసేందుకు అధికార పార్టీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్‌ బంధువు తెరతీశారు. సదరు నాయకుడికి చెందిన ఓ వ్యాపార సంస్థలో మూడు రోజుల కిందట ఏర్పాటు చేసిన రహస్య సమావేశానికి ఐదుగురు మహిళా కౌన్సిలర్ల భర్తలు హాజరయ్యారు. మరో ఇద్దరు తాము అందుబాటులో లేమని చెప్పినట్లు సమాచారం. ఇది అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నర్సంపేట పుర పాలికలో 18 మంది భారాస, ఆరుగురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఉన్నారు. పుర ఎన్నికల్లో అధికార పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన మహిళా కౌన్సిలర్‌ ఫలితాలు వెలువడిన రోజే గులాబీ కండువా కప్పుకొన్నారు. కౌన్సిలర్‌ మహిళ అయినప్పటికీ ఆమె దగ్గర బంధువు వార్డులో, ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని తానై వ్యవహరిస్తుంటారు. మూడేళ్ల కిందట చైర్‌పర్సన్‌ ఎన్నికల సందర్భంగా ప్రతి కౌన్సిలర్‌కు రెండు చేతులా నగదు ఇవ్వగా అప్పుడు ఆ నగదు వీరికి అందలేదు. ఆ కోపంతోనే మూడు రోజుల క్రితం ఐదుగురు మహిళా కౌన్సిలర్ల భర్తలతో సమావేశం జరిపి చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించాలని చెప్పినట్లు తెలిసింది. భేటీకి హాజరైన వారు మాత్రం అతడితో విభేదించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని