logo

ఈసారైనా ‘కాకతీయ’ను కరుణిస్తారా!

రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తర్వాత రెండో పెద్ద వర్సిటీ కాకతీయ. ఉన్నత విద్యాప్రమాణాలతో విరాజిల్లుతున్న కేయూ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Published : 06 Feb 2023 04:10 IST

న్యూస్‌టుడే, కేయూ క్యాంపస్‌: రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తర్వాత రెండో పెద్ద వర్సిటీ కాకతీయ. ఉన్నత విద్యాప్రమాణాలతో విరాజిల్లుతున్న కేయూ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉద్యోగుల వేతనాలు చెల్లించడానికి ప్రతి నెలా అవస్ధలు పడుతోంది. ఈసారి బడ్జెట్‌లో నిధులు అధికంగా కేటాయించి గట్టెక్కించాలని ఇక్కడి అధ్యాపకులు కోరుతున్నారు.

* విశ్వవిద్యాలయాలనికి రావాల్సిన బ్లాక్‌ గ్రాంట్‌(ఉద్యోగుల వేతనాలకు చెల్లించేది) కింద రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెగ్యులర్‌ ఉద్యోగులు, ఫించన్‌దారులకు మాత్రమే నిధులు ఇస్తోంది. దినసరి వేతనం, లంసమ్‌, తాత్కాలిక, టైంస్కేల్‌, ఒప్పంద  ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు. నిధుల కోసం కేయూ ఉన్నతాధికారులు ప్రతి నెలా ఇతర విభాగాలపై ఆధారపడుతున్నారు.

అవసరం ఇలా.. : విశ్వవిద్యాలయంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడంపైనా, న్యాక్‌ బృందం పర్యటనను దృష్టిలో ఉంచుకొని కేయూ ఉపకులపతి ఆచార్య టి.రమేష్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య టి.శ్రీనివాసరావు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. భవనాలను మరమ్మతులు చేయడం, రంగులు వేయడం, అంతర్గత రోడ్లు అభివృద్ధి చేయడం లాంటి పనులు మొదలు పెట్టారు. వీటికి రూ.341 కోట్లు అవసరమని రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. రూ.191 కోట్లు అభివృద్ధి పనులకు, రూ.150 కోట్లు ఉద్యోగుల వేతనాలకు అవసరం అవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

గతంలో కేటాయింపులు ఇలా..

* గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్‌ గ్రాంట్‌ కింద కేవలం రూ.118 కోట్లు మాత్రమే కేటాయించింది. వీటిని ఫించన్‌దారులు, రెగ్యులర్‌ ఉద్యోగులకు వేతనాలు చెల్లించారు. ఏటా రూ.120 కోట్లకుపైగా రెగ్యులర్‌ అధ్యాపకులకే వేతనాల రూపంలో చెల్లించాల్సి వస్తోంది.  

* విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం నాలుగేళ్ల నుంచి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. 2018లో రూ.100 కోట్లు 2019లో రూ.50 కోట్లు, 2020లో రూ.50 కోట్లు కేటాయించినా విడుదల చేయలేదు. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో అసలు కేటాయింపులే లేవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు