logo

కానరాని లోకాలకు అమ్మానాన్న!

కంటి పాపలమంటూ మమ్ములను చూసి మురిసిపోయారు... కుటుంబంలో వెలుగు దివ్వెలంటూ అపురూపంగా చూసుకున్నారు.

Published : 07 Feb 2023 06:04 IST

అనాథలుగా మారిన మోక్షిత్‌, వీక్ష

మహబూబాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే: కంటి పాపలమంటూ మమ్ములను చూసి మురిసిపోయారు... కుటుంబంలో వెలుగు దివ్వెలంటూ అపురూపంగా చూసుకున్నారు. బుడి బుడి అడుగులు వేస్తే అనందపడ్డారు.. అలాంటిది 58 రోజుల కిందట అమ్మ ఆత్మహత్య చేసుకుంటే.. ఆ బాధ నుంచి బయటకు రాలేక పోతున్న ఆ చిన్నారులకు ఆ వేదన సరిపోదన్నట్లు వారి జీవితాల్లో చీకటి నింపుతూ.. ఒంటరిగా వదిలేసి అందనంత దూరానికు ఆ చిన్నారుల నాన్న వెళ్లిపోయారు.. రెండు నెలల వ్యవధిలో దంపతులు ఇద్దరు తనువు చాలించడంతో ఇద్దరు చిన్నారులు ఒంటరివారైన విషాద ఘటన మహబూబాబాద్‌ మండలం రోటిబండతండా గ్రామ పంచాయతీ పరిధిలోని దూద్యాతండాలో జరిగింది. బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. తండాకు చెందిన తేజావత్‌ మల్సూరు, ముత్యాలు కుమారుడు రమేష్‌(30) గడ్డి మందు తాగి ఆత్మహత్యాకు పాల్పడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. దూద్యాతండాకు చెందిన తేజావత్‌ రమేష్‌, మహేశ్వరీ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మోక్షిత్‌ (3), వీక్ష (4) కొడుకు, కూతురు న్నారు. గత డిసెంబర్‌ 14వ తేదీ దంపతుల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన మహేశ్వరీ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె మృతి చెందడంతో మనోవేదనకు గురైన రమేష్‌ ఈ నెల 4వ తేదీ సాయంత్రం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబ సభ్యులు మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమంగా మారి.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించగా అక్కడ మృతి చెందారు. 58 రోజుల వ్యవధిలో దంపతులు మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు. మృతుడి మేనమామ ఆంగోత్‌ కిర్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై అరుణ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని