మహిళల హక్కుల పరిరక్షణకు ఉద్యమం
అన్ని రంగాల్లో సమాన హక్కుల కోసం మహిళలకు ఉద్యమించాలని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ వి.సంధ్య, ఎన్డీ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.
మహబూబాబాద్లో ర్యాలీ నిర్వహిస్తున్న పీవోడబ్ల్యూ నాయకులు
నెహ్రూసెంటర్, న్యూస్టుడే: అన్ని రంగాల్లో సమాన హక్కుల కోసం మహిళలకు ఉద్యమించాలని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ వి.సంధ్య, ఎన్డీ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పీవోడబ్ల్యూ మూడో రాష్ట్ర మహాసభలు జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలుత ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు పీవోడబ్ల్యూ కార్యకర్తలు, మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఓసీ క్లబ్లో నిర్వహించిన బహిరంగ సభలో సభ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమంలో పీవోడబ్ల్యూ బలమైన మహిళా సంఘంగా గుర్తింపు పొందిందన్నారు. పాలకులు అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలు, ఆదివాసీల హక్కుల సాధన, కుటుంబ హింస, దాడులను ప్రతిఘటించే విధంగా మహిళల్లో చైతన్యం నింపేందుకు మహబూబాబాద్లో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వక్తలు మాట్లాడుతూ పోడు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులపై ప్రభుత్వం అటవీశాఖ అధికారులతో దాడులు చేయిస్తోందన్నారు. ఆటవీ సంరక్షణ చట్టం-2022ను ఉపసంహరించాలన్నారు. జీఎస్పీ పేరిట సామాన్య ప్రజలపై భార మోపుతూ కార్పొరేట్ సంస్థలు రూ.వేల కోట్లు కట్టబెడుతున్నారన్నారు. ఆదివాసీ హక్కులపై సాగుతున్న దండయాత్రకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. బహిరంగ సభలో అరుణోదయ కళాకారులు కోలాటాలు, ఆట పాటలతో అలరించారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి సుభద్ర, జాతీయ నాయకులు రమాసుందరి, గౌని ఐలయ్య, ఊకె.పద్మ, కృష్ణవేణి, అరుణోదయ కళాకారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.