logo

శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

ఇంటర్‌లో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

Published : 08 Feb 2023 05:09 IST

జూనియర్‌ కళాశాలల్లో కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు

భూపాలపల్లి కళాశాలలో సన్నద్ధమవుతున్న విద్యార్థినులు

భూపాలపల్లి, న్యూస్‌టుడే: ఇంటర్‌లో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. గతంలో ఎదురైన అడ్డంకులను అధిగమించేందుకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నారు. కొన్ని ప్రభుత్వ కళాశాలలకు దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. సమయానికి బస్సులు లేకపోవడంతో చాలా మంది తరగతులకు గైర్హాజరవుతున్నారు. ఇలాంటి వారికి అధ్యాపకులు మధ్యాహ్నం వేళ బోధిస్తూ, సందేహాలు నివృత్తి చేస్తున్నారు.

అధ్యాపకుల ప్రత్యేక దృష్టి

మొత్తం ఐదు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,050 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఉదయం, సాయంత్రం వేళల్లో తరగతుల వారీగా బోధిస్తున్నారు. వెనుకబడిన వారిని గుర్తించి పాఠ్యాంశాల్లో పట్టు పెంచేందుకు కృషిచేస్తున్నారు. సహచర విద్యార్థులను బృందాలుగా విభజించి, సాధనలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన వార్షిక పరీక్షల ప్రశ్న పత్రాలతో నిత్యం సాధన చేయిస్తున్నారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు..

* ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు కలగానే మిగిలింది.

* దూర ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. 

* గ్రామీణ ప్రాంతాల్లో తల్లితండ్రుల నిరక్షరాస్యత విద్యార్థుల హాజరుపై ప్రభావం చూపుతోంది.

*  అధ్యాపకులు తల్లిదండ్రులను సెల్‌ఫోన్లలో సంప్రదించినప్పటికీ విద్యార్థులు కొందరు సక్రమంగా రావటం లేదు.

* ఆర్టీసీ బస్సులు సమయ పాలన పాటించకపోవటంతో కొందరు ప్రత్యేక తరగతులకు హాజరు కాలేకపోతున్నారు.

అల్పాహారం అందిస్తే మేలు..

మధ్యాహ్న భోజనం లేకపోవడంతో పస్తులుంటున్నారు. సాయంత్రం వరకు కళాశాలల్లోనే ఉండటంతో అలసటతో పాఠాలు చెవికెక్కడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దాతలు అల్పాహారం అందిస్తే చదువుపై మరింత దృష్టి సారించే అవకాశాలుంటాయి.  ప్రభుత్వ కళాశాలల్లో పేద పిల్లలే ఎక్కువ మంది చదువుతున్నారు. వారి ఆకలి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, పాలకులు ముందుకు రావల్సిన అవసరం ఎంతైనా ఉంది.


పాఠ్యాంశాలపై పట్టు పెంచుకుంటున్నా  
- అంజలి, ఇంటర్‌ రెండో సంవత్సరం

అధ్యాపకుల సూచనల మేరకు పాఠ్యాంశాలపై పట్టు పెంచుకోవడానికి ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నా. ప్రత్యేక తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావటం వల్ల కొన్ని సబ్జెక్టుల్లో ముఖ్యమైన అంశాల గురించి తెలుస్తోంది. సబ్జెక్టులకు సంబంధించిన సందేహాలను అధ్యాపకులు నివృత్తి చేస్తున్నారు.


మంచి మార్కుల సాధనే లక్ష్యం
- జె.భరత్‌, ఇంటర్‌ మొదటి సంవత్సరం

మంచి మార్కులు సాధించాలని నిర్ణయించుకున్నా. అధ్యాపకులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సందేహాలను వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మంచి మార్కులు సాధించి అమ్మానాన్నల కలలు సాకారం చేస్తా. గత వార్షిక పరీక్ష ప£త్రాల తీరును వివరిస్తూ బోధిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని