logo

ఒక రోడ్డు ప్రమాదం.. మూడు కుటుంబాల్లో విషాదం

ఒక రోడ్డు ప్రమాదం.. మూడు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.. రెక్కాడితే గాని డొక్కాడని ఇరు కుటుంబాల్లో ఇద్దరు, దైవ దర్శనం కోసం వెళ్లి వస్తున్న కుటుంబంలోని బాలిక మృతి చెందారు.

Published : 08 Feb 2023 05:09 IST

డీసీఎంను ఢీ కొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం

శ్రీహిత                   రాజశేఖర్‌                రహీంఖాన్‌

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: ఒక రోడ్డు ప్రమాదం.. మూడు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.. రెక్కాడితే గాని డొక్కాడని ఇరు కుటుంబాల్లో ఇద్దరు, దైవ దర్శనం కోసం వెళ్లి వస్తున్న కుటుంబంలోని బాలిక మృతి చెందారు. కుటుంబాన్ని పోషించే యజమానులు మృతి చెందడంతో.. వారినే నమ్ముకొని జీవిస్తున్నవారు రోడ్డున పడ్డారు. మరో కుటుంబంలో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కంటి పాప మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం.

జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తి పరిధిలో హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు జామున టైరు పంక్చరు కావడంతో ఆగిన డీసీఎం వ్యాన్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన పాత ఇనుప సామగ్రి యజమాని వాటం రాజశేఖర్‌(33), సికింద్రాబాద్‌ చిలుకలగూడకు చెందిన డీసీఎం డ్రైవర్‌ అబ్దుల్‌ రహీంఖాన్‌(38) అక్కడికక్కడే మృతి చెందారు. అబ్దుల్‌ రహీంఖాన్‌ డీసీఎం నడుపుతూ.. ఐదేళ్లుగా యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలో కుటుంబంతో నివసిస్తున్నారు. రాజశేఖర్‌ తన పాత ఇనుప సామగ్రి లోడ్‌ను రహీంఖాన్‌ తన డీసీఎంలో ప్రజ్ఞాపూర్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే దుర్ఘటన జరగడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరోవైపు పెద్దపల్లి జిల్లా రానాపూర్‌కు చెందిన మిర్యాల దేవేందర్‌ రెడ్డి ఓ బ్యాంకులో మేనేజర్‌, అతని భార్య శ్రావణి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఈ దంపతులకు కుమార్తె శ్రీహిత(7) ఉన్నారు. వీరు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఉంటున్నారు. నాలుగు రోజుల కిందట కాజీపేటలో తమ బంధువులతో కలిసి తిరుపతి దైవ దైర్శనానికి వెళ్లి రైలు ప్రయాణం ద్వారా తిరిగి కాజీపేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. పెంబర్తి వద్ద డీసీఎం నిలిపి ఉన్న చోటుకు రాగానే కారు అదుపు తప్పి డీసీఎంను ఢీ కొట్టడంతో దేవేందర్‌రెడ్డి, శ్రావణి, శ్రీహితలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో జనగామకు తరలిస్తుండగా మార్గమధ్యలో శ్రీహిత మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండటంతో.. దేవేందర్‌రెడ్డి, శ్రావణిని వరంగల్‌కు తరలించారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ సీతారాం, ఏసీపీ దేవేందర్‌ రెడ్డి, సీఐ శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జనగామ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

మిన్నంటిన రోదనలు..

రోడ్డు ప్రమాద మృతులు డీసీఎం డ్రైవర్‌ రహీంఖాన్‌కు భార్య హస్మ, పిల్లలు ఫాతిమా, జబి ఉన్నారు. రాజశేఖర్‌కు భార్య ధనలక్ష్మి, పిల్లలు అనిశ్‌, సహస్ర, స్త్రీనిధి ఉన్నారు. మూడు కుటుంబాలకు చెందిన వారు మృతి చెందడంతో.. ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో బంధువులు తరలి వచ్చారు. ఆసుపత్రి ప్రాంగణంలో వారి రోదనలు మిన్నంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని