logo

కూలీల కొరత.. కర్షకుల వ్యథ

గోదావరి వరదలతో మిర్చి పంట ఆలస్యంగా సాగు చేసిన రైతులు మిరప పండ్లను కోసేందుకు అల్లాడుతున్నారు.

Published : 19 Mar 2023 05:46 IST

వాజేడులో పండ్లు కోయని మిరప తోట

వాజేడు(ములుగు జిల్లా), న్యూస్‌టుడే: గోదావరి వరదలతో మిర్చి పంట ఆలస్యంగా సాగు చేసిన రైతులు మిరప పండ్లను కోసేందుకు అల్లాడుతున్నారు. కూలీల కొరతతో తోటల్లోనే పండ్లు రాలిపోతున్నాయి. జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాలైన వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లో ఈ ఏడాది మిర్చి అధికంగా సాగు చేశారు. గతేడాది పలుమార్లు సంభవించిన గోదావరి వరదలతో పల్లపు చేలన్నీ వరదనీట మునగడంతో మిరప నాట్లు ఆలస్యంగా వేశారు. ఒకేసారి ఎక్కువ మంది రైతులు కోతలు చేపట్టడంతో కూలీలు దొరకడం లేదు.

ఇంటిముఖం పట్టిన ఛత్తీస్‌గఢ్‌ వాసులు

ఈ ఏడాది మిరప పంటను సాగు చేసిన రైతుల సంఖ్య పెరగడం కూలీల కొరతకు ప్రధాన కారణం. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చిన కూలీలలో అధికశాతం మంది తునికాకు పొదలు సరిచేసేందుకు(మోడెం నరికేందుకు) స్వగ్రామాలకు వెళ్లారు. దీంతో మిరప పండ్ల సేకరణలో జాప్యం ఏర్పడుతోంది. రెండు రోజులుగా వర్షంతో కోతలు సరిగా సాగడం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే నేల రాలుతున్నా ఏం చేయలేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉపాధి పనులకూ అంతంతమాత్రమే..

ఇదే సమయంలో ఉపాధిహామీ పథకం పనులకు రావాలంటూ అధికారులు, సిబ్బంది గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. నెలవారీ లక్ష్యాలను నిర్ణయించి పనులను చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధి సిబ్బంది కూలీల ఇంటింటికీ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ప్రయోజనం ఉండడం లేదు. మిరప కోతల సమయంలో ఉపాధి పనులేమిటంటూ రైతులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. గతేడాది రోజుకు కేవలం రూ.120 మాత్రమే చెల్లించారంటూ చెబుతున్నారు. కూలీలు రాకపోవడంతో శాఖాపరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ ఉపాధి సిబ్బంది వాపోతున్నారు. జాబు కార్డులను తొలగించే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నా వినడం లేదని పేర్కొంటున్నారు.

* వాజేడు మండలంలో 3697 మంది రైతులు 5690 ఎకరాలలో మిరపపంటను సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారుల అంచనా. కోతలకు వలస కూలీలను ఏర్పాటు చేసుకోలేని సన్న, చిన్నకారు రైతులు సమూహంగా ఏర్పడుతున్నారు. రైతులు నాలుగైదు కుటుంబాలు ఒక జట్టుగా ఏర్పడి పండ్లను సేకరిస్తున్నారు. ఈ తరుణంలో అకాలవర్షంతో సతమతమవుతున్నారు. ఈదురు గాలులు, వర్షాలకు తోటలోనే పండ్లు రాలిపోతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు