logo

చెరువు కట్టనే తవ్వేస్తున్నారు..!

జిల్లా కేంద్రంలో చెరువు కట్టలను కూడా ఆక్రమించేందుకు అక్రమార్కులు అడ్డదారులు వెదుకుతున్నారు. ఇప్పటికే పట్టణ నలుమూలల ఉన్న చెరువులు, కుంటల శిఖం భూములను పలువురు ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.

Published : 24 Mar 2023 04:16 IST

మహబూబాబాద్‌ పట్టణంలోని కంబాల చెరువు కట్టను తవ్విన కబ్జాదారులు

మహబూబాబాద్‌, మహబూబాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో చెరువు కట్టలను కూడా ఆక్రమించేందుకు అక్రమార్కులు అడ్డదారులు వెదుకుతున్నారు. ఇప్పటికే పట్టణ నలుమూలల ఉన్న చెరువులు, కుంటల శిఖం భూములను పలువురు ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అధికారులు నామమాత్రపు దాడులు చేసి మిన్నకుండిపోతున్నారు. వీటిని అలుసుగా తీసుకొని మరికొందరు అక్రమార్కులు మహబూబాబాద్‌ - మరిపెడ జాతీయ రహదారి పక్కనే ఉన్న చెరువు కట్టనే ఏకంగా తవ్వేసి బఫర్‌ జోన్‌ కింద ఉన్న భూమిని ఆక్రమించారు. ఆ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చేందుకు ముందస్తు ప్రణాళికతో ఇళ్లు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.

‘కంబాల’ పై కన్ను..

మహబూబాబాద్‌ పట్టణ శివారులోని కంబాలచెరువు కట్టను మధ్య నుంచి తవ్వి దిగువ ప్రాంతంలో ఉన్న భూమిని చదును చేస్తున్నారు. సుమారు 813 మీటర్ల పొడవు 84.7 ఎకరాల విస్తీర్ణంలో లోతట్టు ఉన్న చెరువుపై కన్నేసిన కొందరు ఆ చెరువు శిఖం భూమిని కూడా ఆక్రమించారు. మత్తడి దిగువ ప్రాంతాన్ని, మరిపెడ రహదారిలో ప్రస్తుతం ఈవీఎం గోదాం ఎదురుగా ఉన్న చెరువు కట్ట వరకు రూ. లక్షల విలువైన స్థలాన్ని కొందరు సొంతం చేసుకున్నారు. ఈ చెరువు కింద 214 ఎకరాలు ఆయకట్టు ఉండగా 108 మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. కంబాల చెరువుకట్ట కింద ఉన్న వ్యవసాయ భూమిని విక్రయించిన ఓ రైతు ఆ చెరువు కట్ట తన ఆధీనంలో ఉందంటూ ఆ కట్టను జేసీబీతో తవ్వి ఇళ్లు నిర్మించేందుకు యత్నిస్తున్నారు. చెరువు కట్టను తవ్వుతున్నారని కొందరు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి నేటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


క్రిమినల్‌ కేసు నమోదు చేస్తాం
- కిషోర్‌కుమార్‌, నీటి పారుదల శాఖ డీఈ

చెరువు కట్టను తవ్వుతున్నారని కొందరు రైతులు ఫిర్యాదు చేశారు. చెరువు కట్టను  తవ్విన వారిని హెచ్చరించాం. చెరువు కట్టను తవ్వితే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తాం. వారు వినకుంటే తగిన చర్యలు చేపడుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని