logo

సైబర్‌ వల.. జనం విలవిల

మన ఆశే వారికి ఆయుధం.. మనం నమోదు చేసే సమాచారమే వారికి కల్పతరువు... ఏ రూపంలోనైనా వస్తారు... మాయమాటలు చెబుతారు. బ్యాంకు అధికారిగా ముచ్చటిస్తారు.. లాటరీ వచ్చిందటూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ..

Published : 27 Mar 2023 06:04 IST

పెరుగుతున్న బాధితులు

న్యూస్‌టుడే, వరంగల్‌ క్రైం: మన ఆశే వారికి ఆయుధం.. మనం నమోదు చేసే సమాచారమే వారికి కల్పతరువు... ఏ రూపంలోనైనా వస్తారు... మాయమాటలు చెబుతారు. బ్యాంకు అధికారిగా ముచ్చటిస్తారు.. లాటరీ వచ్చిందటూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. తక్కువ ధరకు వాహనాలు ఇస్తామని..  యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పి.. వ్యాపారిలా చాటింగ్‌ చేసి అందినంత గుంజేస్తారు.. క్రిడెట్‌, డెబిట్‌ కార్డుల సమాచారం తస్కరించి ఆన్‌లైన్‌లోనే నగదు కాజేస్తారు. నెట్టింట్లో వైరస్‌లా తిష్ఠ వేస్తారు. హ్యాకర్‌గా ముప్పుతిప్పలు పెడతారు. మన కష్టార్జితం క్షణాల్లో పోతుంది..

రోజురోజుకు ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఓటీపీలు, వ్యాలెట్ల యూపీఐల సంఖ్యలను తీసుకొని ఖాతాల్లో నుంచి సొమ్మును కాజేస్తున్నారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో రోజుకో చోట సైబర్‌ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్మీలో పనిచేస్తున్నామని, మరోచోటకి బదిలీ అయిందని, వాహనాలు, ఫర్నిచర్‌ తక్కువ ధరకు అమ్మేస్తున్నామని ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో పాలనాధికారుల వాట్సప్‌ స్టేటస్‌లను వాడుకొని మోసం చేసిన ఘటనలూ ఉన్నాయి.

కమిషనరేట్‌లోని సైబర్‌ విభాగంలో పనిచేస్తున్న పోలీసులు


మోసాలు ఇలా

* సుబేదారి ఠాణా పరిధిలో విశ్రాంత ఉద్యోగికి  ఓ వ్యక్తి ఫోన్‌ చేసి మీ బ్యాంక్‌ కార్డు సమయం అయిపోయింది,  వెంటనే అప్‌డెట్‌ చేయాలని, చరవాణికి వచ్చిన ఓటీపీ నెంబర్‌ చెప్పాలని సూచించాడు. సదరు విశ్రాంత ఉద్యోగి ఓటీపీ నెంబర్‌ చెప్పడంతో ఖాతా నుంచి రూ. 85వేలు ఇతర ఖాతాల్లోకి వెళ్లాయి. తిరిగి చెల్లిస్తామని చెప్పి మరో రూ. 25వేల వరకు సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
*కారు యజమాని విదేశాలకు వెళ్తున్నాడు, అతని విలువైన కారును తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి హనుమకొండకు చెందిన వ్యాపారికి రూ. 2 లక్షలు సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారు.
* ఇంటి నుంచి చేసే ఉద్యోగం ఇస్తామని చెప్పి వరంగల్‌కు చెందిన విద్యార్థిని ఖాతా నుంచి నేరగాళ్లు సుమారు రూ. 50 వేలు కాజేశారు.
* కాజీపేట వెంకటాద్రినగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌కు కేవైసీ అప్‌డేట్‌ చేయాలని సందేశంతో కూడిన లింక్‌ రాగా అది నిజమేనని నమ్మి ఓటీపీ సహా అన్ని వివరాలు నమోదు చేసిన కొంత సేపటికి అతడి ఖాతా నుంచి రూ.25 వేలు బదిలీ అయ్యాయి.
* క్రెడిట్‌ కార్డు పరిమితి పెంచుతామని దర్గా కాజీపేటకు చెందిన ఓ వ్యక్తి ఫొన్‌కు లింక్‌ రాగా దాన్ని ఒపెన్‌ చేసి అన్ని వివరాలు నమోదు చేశాడు. కొద్ది సేపటికి అతడి ఖాతా నుంచి రూ.1.11 లక్షలు ఉపసంహరించినట్లు సంక్షిప్త సమాచారం రావడంతో మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు..


ఇలా నియంత్రించాలి..

* చరవాణులకు వచ్చే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో తెరవొద్దు.
* తెలియని వ్యక్తులు పంపించే లింక్‌లను వెంటనే డిలిట్‌ చేయాలి.
* లావాదేవీలను బ్యాంక్‌లకు వెళ్లి సరిచూసుకోవాలి. బ్యాంక్‌ అధికారులు ఎప్పుడు ఖాతాదారులకు ఫోన్‌ చేయరు.
* గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్‌ చేయొద్దు, వ్యక్తిగత వివరాలు తెలియజేయొద్దు.
* చరవాణులకు వచ్చిన ఓటీపీ నెంబర్లను ఇతర వ్యక్తులకు చెప్పొద్దు.
* సైబర్‌ నేరగాళ్లు యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయాలని చెబుతారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు.
* సైబర్‌ నేరాగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 లేదా డయల్‌ 100 కాల్‌ చేయాలి. సంబంధిత ఠాణాలో ఫిర్యాదు చేయాలి.


అవగాహన కల్పిస్తున్నా..

సైబర్‌ మోసాలపై పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, కాలనీలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నేరగాళ్లు ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతున్నారు. అయినా కొందరు మోసాల బారిన పడుతూనే ఉన్నారు. కమిషనరేట్‌ పరిధలో ఇప్పటి వరకు వేయికి పైగా సదస్సులు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సైబర్‌ నేరగాళ్లు కొత పంథాల్లో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.


ల్యాబ్‌ ఏర్పాటు

గతంలో బాధితులు ఫిర్యాదు చేస్తే హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసుల సహకారంతో విచారణ జరిపేవారు. కేసుల సంఖ్య పెరగడంతో 2018 మార్చి 18న వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేకంగా సైబర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలు దిల్లీ, హరియాణ, ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలకు వెళ్లి నిందితులను పట్టుకున్నారు. అరెస్టు చేసి సొమ్ము రాబట్టగలిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని