logo

పిల్లల ఆరోగ్య రక్షణకు పోషణ్‌ పఖ్వాడా

పిల్లల్లో పోషకాహార లోపంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. బరువు తక్కువగా ఉండడం, ఎదుగుదల లోపించడం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి.

Published : 27 Mar 2023 06:04 IST

జనగామలో ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: పిల్లల్లో పోషకాహార లోపంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. బరువు తక్కువగా ఉండడం, ఎదుగుదల లోపించడం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. బాలల్లో పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో పోషణ్‌ అభియాన్‌ను ప్రారంభించి మహిళా, శిశు సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తోంది. ఈ     మేరకు జిల్లాలో ఈ నెల 20 నుంచి మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్యర్యంలో పోషణ్‌ పక్వాడా పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు

జిల్లా సంక్షేమశాఖ ద్వారా అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో పోషకాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి అందించాల్సిన పౌష్టికాహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ఐసీడీఎస్‌ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. కలెక్టర్‌ శివలింగయ్య ఆదేశాలతో జిల్లా సంక్షేమ అధికారిణి జయంతి ఆధ్వర్యంలో   పోషణ్‌ పఖ్వాడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


ఆరోగ్యకర చిన్నారులకు పురస్కారాలు

ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలను గుర్తిస్తారు. వారిలో వయస్సు, ఎత్తుకు తగిన బరువు ఉండి, పోషకాహార లోపం లేని చిన్నారులను గుర్తించి వెల్‌ బేబీ పురస్కారాలు అందజేయనున్నారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లల కుటుంబాలను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.


చిరు ధాన్యాలు అందించండి

పోషక విలువలు అధికంగా ఉన్న చిరు ధాన్యాలైన కొర్రలు, అరికెలు, జొన్నలు, సజ్జలు, రాగులు, కుసుమలు, అండు కొర్రలు.. తదితరాలను పిల్లలకు అందించాలని సూచిస్తున్నారు. వీటిలో అధిక శాతం విటమిన్‌ బీ-12, బీ-17, బీ-6, పీచు పదార్థాలు ఉంటాయి. గ్రామాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 23న జనగామ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పోషణ్‌ పక్వాడాపై విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. 25 నుంచి 28వ తేదీ వరకు రక్తహీనతపై మహిళలు, పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 29న కళాశాలల్లో సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 31న యోగా, ఏప్రిల్‌ 1న స్వయం సహాయక సంఘాలతో చిరు ధాన్యాలపై అవగాహన, 3న మహిళల భర్తలతో పోషకాహారంపై వంటల పోటీలు నిర్వహిం నున్నారు. అన్ని గ్రామాల్లో పోషక లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స  అందించాలని అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలకు సూచనలు చేశారు. ప్రతి రోజూ అంగన్‌వాడీ కేంద్రాలను సూపర్‌వైజర్లు సందర్శించేలా చర్యలు చేపట్టనున్నారు.


పోషకాహార ప్రాధాన్యాన్ని తెలిపేందుకే.. : జయంతి, జిల్లా సంక్షేమ అధికారిణి

ఈ నెల 23 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జిల్లా వ్యాప్తంగా పోషణ్‌ పఖ్వాడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు చిరు ధాన్యాలు, పోషకాహార ప్రాముఖ్యాన్ని తెలిపేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. పిల్లల్లో పోషక లోపం లేకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. అంగన్‌వాడీ కేంద్రాల సేవలను వినియోగించుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు