logo

భూకబ్జాదారులపై టాస్క్‌ఫోర్స్‌ నజర్‌!

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ రెండో అతిపెద్ద నగరం. మహానగరంగా మారింది.. స్మార్ట్‌గా అభివృద్ధి చెందుతోంది..

Published : 27 Mar 2023 06:04 IST

ఠాణాల వారీగా జాబితా తయారు

ఇటీవల భూకబ్జాలకు సంబంధించిన నకిలీ పత్రాలను పట్టుకున్న పోలీసులు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ రెండో అతిపెద్ద నగరం. మహానగరంగా మారింది.. స్మార్ట్‌గా అభివృద్ధి చెందుతోంది.. దీంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.. భూకబ్జాలూ పెరిగిపోతున్నాయి.. స్థలం కనిపిస్తే చాలు కొందరు కన్నేస్తున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. భూవిక్రయాలు జరుపుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి దందాలు బాగా పెరిగిపోయాయి. వరంగల్‌ పోలీసు కమిషనర్‌ రంగనాథ్‌కు భూవివాదాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. వీటికి చెక్‌ పెట్టడానికి టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. భూకబ్జాలపై దృష్టి సారించిన పోలీసులు కబ్జాదారుల వివరాలు సేకరిస్తున్నారు.


42 మంది గుర్తింపు

వరంగల్‌ నగరంలోని ఏడు ఠాణాల పరిధిలో భూవివాదాలపై కేసులు నమోదయ్యాయి. ఆ వివరాలను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సేకరించారు. సుమారు 42 మంది వరకు భూకబ్జాలకు పాల్పడినట్లు గుర్తించారు. వీరికి ఎవరు సహకరించారనే కోణంలో విచారణ చేస్తున్నారు. అనుమానితులను తమ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొంతమంది రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేశారు. తమ వారిని పిలవద్దని చెబుతున్నారు.


నకిలీ పత్రాల సృష్టి ఇలా

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారణలో పలు ఆసక్తి అంశాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలో కొంతమంది నకిలీ వీలునామా, పాత తేదీల్లో ఉన్న బాండ్‌ పత్రాలను విక్రయిస్తున్నారు. ఒక్కో దానికి రూ.10 వేల నుంచి రూ. 50వేల వరకు తీసుకుంటున్నారు. దీంతో భూకబ్జాదారులు వీటిని కొనుగోలు చేసి కొందరు ఉద్యోగుల సహకారంతో నకిలీ పత్రాలు తయారు చేస్తున్నారు. మార్కెట్‌లో భూములు అమ్ముతున్నారు. అసలు యజమానికి భూమి గురించి తెలిసే సరికి ఇద్దరు ముగ్గురు చేతులు మారుతున్నాయి.


క్షేత్రస్థాయిలో విచారణ

భూవివాదాలపై కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. ఎస్‌వోపీని అనుసరిస్తూ ఇరువర్గాల వద్ద ఉన్న భూమికి సంబంధించిన పత్రాలు, సర్వేనెంబర్లు, ప్రస్తుతం కబ్జాలో ఎవరు ఉన్నారు? ఎంత కాలం నుంచి వీరు ఉంటున్నారు. అనే విషయాలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. భూమికి సంబంధించిన పత్రాలపై ఏదైన అనుమానం వస్తే వెంటనే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. సమగ్ర విచారణ చేసి అసలు యజమానికి న్యాయం చేస్తున్నారు.


ఘటనలు ఇలా..

* ఇటీవల హనుమకొండ ఠాణా పరిధిలోని కాకతీయకాలనీలో భూవివాదంలో జోక్యం చేసుకొని ఎదుటి వ్యక్తి భూమిని విక్రయించాలని ఒత్తిడి తెచ్చిన ప్రజాప్రతినిధిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
* మడికొండలో సైతం భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ప్రజాప్రతినిధితో పాటు కొంతమంది భూఆక్రమణదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
* వరంగల్‌ కమిషరనేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కేయూ ఠాణా పరిధిలో నకిలీ పత్రాలు సృష్టించి భూ క్రయవిక్రయాలు జరిపిన ముఠా సభ్యులను పట్టుకున్నారు. వారి నుంచి నకిలీ పత్రాలు, కంప్యూటర్‌, ప్రింటర్‌ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని