logo

మరోసారి సత్తా చాటిన మరియపురం

గీసుకొండ మండలంలోని జాతీయ ఉత్తమ గ్రామమైన మరియపురం మరోసారి తన సత్తా చాటి రాష్ట్ర స్థాయిలో రెండు అవార్డులకు ఎంపికైంది.

Updated : 31 Mar 2023 06:01 IST

రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు

గీసుకొండ, న్యూస్‌టుడే: గీసుకొండ మండలంలోని జాతీయ ఉత్తమ గ్రామమైన మరియపురం మరోసారి తన సత్తా చాటి రాష్ట్ర స్థాయిలో రెండు అవార్డులకు ఎంపికైంది. గతేడాది ఈ గ్రామం జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామంగా ఎంపికవగా ఈ ఏడాది రాష్ట్రంలో ఉత్తమ గ్రామంగా ఎంపికవడం గమనార్హం. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ స్టేట్‌ వికాస్‌ పురస్కార్‌, నేషనల్‌ పంచాయతీ అవార్డులను 2021-22 సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ప్రకటించింది. 9 అంశాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకుగాను రాష్ట్రంలో మొత్తం 27 గ్రామపంచాయతీలను ఉత్తమ గ్రామాలుగా ఎంపిక చేసి ప్రకటించింది. జిల్లాలో అన్ని అంశాలకు పోటీ పడి  మరియపురం తొమ్మిది అంశాల్లో నూరుశాతం ఫలితాలను సాధించగా, రాష్ట్ర స్థాయిలో ఆరోగ్యకరమైన పంచాయతీ అనే అంశంపై ప్రథమ స్థానానికి ఎంపికైంది. కాలుష్యరహిత గ్రామంగా కార్బన్‌ నేచురల్‌ విశేష్‌ పంచాయతీ పురస్కారం (సీఎన్‌వీపీపీ) కింద మరో ప్రత్యేక అవార్డుకు ఎంపిక చేశారు. గ్రామంలో సోలార్‌ దీపాల ఏర్పాటు, పచ్చదనం పెంచడంలో ముందంజలో నిలిచింది.


జాతీయ స్థాయిలోనూ అవార్డు వస్తుంది
- అల్లం బాలిరెడ్డి, మరియపురం సర్పంచి

రాష్ట్రస్థాయిలో మా గ్రామానికి రెండు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు అధికారులు, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులు తనకు పూర్తి స్థాయిలో సహకరించడంవల్లే ఇది సాధ్యమైంది. తన పదవీకాలం పూర్తయ్యేలోగా గ్రామం మొత్తం సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసి ఎవరికి కావాల్సిన విద్యుత్తును వారే సొంతంగా తయారు చేసుకునేలా కృషి చేస్తా.  మరోసారి జాతీయ స్థాయిలో అవార్డు వస్తుందని అనుకుంటున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని