logo

రైతుకు నష్టం.. వ్యాపారికి లాభం

వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ కమిటీ మిర్చి బస్తాల బరువుకు సంబంధించి జారీచేసిన కొత్త మార్గదర్శకాలు రైతన్నకు నష్టం చేకూరుస్తుండగా, వ్యాపారులకు వరంగా మారనున్నాయి

Published : 31 Mar 2023 05:14 IST

న్యూస్‌టుడే, ఎనుమాముల మార్కెట్‌

బస్తా బరువు తగ్గించి తీసుకురావాలని రైతుకు కరపత్రం అందజేస్తున్న ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి

వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ కమిటీ మిర్చి బస్తాల బరువుకు సంబంధించి జారీచేసిన కొత్త మార్గదర్శకాలు రైతన్నకు నష్టం చేకూరుస్తుండగా, వ్యాపారులకు వరంగా మారనున్నాయి. గతంలో ఒక్కో బస్తా 55 కిలోల వరకు ఉండేది. ఏప్రిల్‌ నెల ఒకటో తేదీ నుంచి మిర్చి బస్తాలను 25 కిలోలకు తగ్గకుండా, 49 కిలోలకు మించకుండా తీసుకురావాలని మార్కెట్‌ కమిటీ ఆదేశించింది. ఈ నిబంధనల వల్ల మిర్చి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తరుగు పేరుతో వ్యాపారులు విధిస్తున్న కోత వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. మిర్చి సీజన్‌లో ప్రతి రోజు సుమారు 50 వేల మిర్చి బస్తాలు మార్కెట్‌కు వస్తాయి. ఇప్పటివరకు ఒక్కో బస్తా 55 కిలోల బరువు ఉండేది. ఇప్పుడు 49 కిలోల పరిమితి విధించడం వల్ల అదనంగా 6వేల బస్తాలు తీసుకురావాల్సి వస్తుంది. ప్రస్తుతం ఒక్కో బస్తాపై కిలో తరుగు తీసేస్తున్నారు. తేజ మిర్చి ధర క్వింటా (సుమారు రెండు బస్తాలు) సరాసరి రూ.23వేలు ఉంటే బస్తాకు రూ.115 లెక్కన తరుగు తీస్తున్నారు.. ఈలెక్కన 50వేల బస్తాలపై సుమారు రూ.57.5 లక్షలు తరుగు కింద వసూలు చేస్తున్నారు. కొత్తగా విధించిన 49 కిలోల నిబంధనల ప్రకారం అదనంగా 6122 బస్తాలు రైతులు తీసుకురావాల్సి ఉంది. ఆ మేరకు వ్యాపారులు అదనంగా రూ.6.90 లక్షలు వసూలు చేయనున్నారు. మరోవైపు ఈ నిబంధన వల్ల రైతులు అదనంగా బస్తాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఒక్కో బస్తా రూ.60 లెక్కన అదనంగా 6వేల బస్తాలపై 3.6 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఒక్కో బస్తాకు వ్యాపారులు ఇచ్చేది మాత్రం రూ.30 మాత్రమే. అదీ ఎటువంటి చిల్లులు లేకుండా నాణ్యతగా ఉంటేనే. 6వేల బస్తాలపై రైతులకు కేవలం రూ.1.8 లక్షలు మాత్రమే తిరిగి వస్తోంది. అంటే అదనంగా కొన్న బస్తాలపైనా రూ.1.8 లక్షల మేర నష్టపోతున్నారు.

పట్టించుకోని పాలకవర్గం..

రైతుల పక్షాన నిలవాల్సిన పాలకవర్గం ఏ సందర్భంలోనూ.. గొంతువిప్పి వారి తరపున మాట్లాడింది లేదు. కేవలం మార్కెట్‌ నిధులతో అధ్యయనం పేరిట విహార యాత్రలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలకు 5వేలకు పైగా మిర్చి బస్తాలు తడిసిపోగా.. వ్యాపారులు తరుగు తీస్తున్నారని రైతన్నలు రోడ్డుకెక్కి వాహనాలు అడ్డుకున్నారు. సుమారు రెండు గంటలపాటు నడిరోడ్డుపై బైఠాయించి ధర్నా చేసినా.. మార్కెట్‌ పాలకవర్గ సభ్యుడు ఒక్కరు కూడా రైతులకు న్యాయం చేసేందుకు ముందుకురాకపోవడం గమనార్హం. ప్రస్తుతం రైతులకు నష్టం చేసే మిర్చి బస్తాల బరువు విషయంలోనూ పాలకవర్గ సభ్యులు నోరుమెదపక పోవడం, రైతుల తరఫున నిలవకపోవడం పాలకవర్గం పనితీరుకు అద్దం పడుతోంది. 


నిర్ణయం సరైనది కాదు..
సోమిశెట్టి భూమయ్య, స్తంభంపల్లి గ్రామం, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా

బస్తాల బరువును నిర్ణయించడం సరైనది కాదు. శ్రమకోర్చి పంట పండించిన తర్వాత కూలీలతో బస్తాలు నింపిస్తాం. ఆ బస్తాలనే మార్కెట్కు తీసుకొస్తాం. బస్తాల బరువును తూకం వేయడానికి మా వద్ద కాంటాలు ఉండవు. 49 కిలోల నిబంధనల వల్ల 50 క్వింటాళ్లు పండించిన రైతు సగటున రూ.8500 మేర నష్టపోతున్నారు. రైతులకు న్యాయం చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని