logo

పాఠశాలల సమస్త సమాచారం.. ట్యాబ్‌లో నిక్షిప్తం

రోజురోజుకు సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వం ‘ట్యాబ్‌’లను పంపిణీ చేస్తూ, అందులోనే పూర్తి వివరాలను నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నాయి.

Published : 01 Apr 2023 04:11 IST

జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిల్వ చేసిన ‘ట్యాబ్‌’ లకు చెందిన బాక్సులు

న్యూస్‌టుడే, భూపాలపల్లి: రోజురోజుకు సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వం ‘ట్యాబ్‌’లను పంపిణీ చేస్తూ, అందులోనే పూర్తి వివరాలను నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నాయి. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఈ మేరకు పాఠశాలల ప్రారంభానికి ముందే ఏకరూప దుస్తులు పంపిణీ చేయనుంది. ఇప్పటికే వస్త్రం పంపిణీ చేయడంతో జిల్లా విద్యా శాఖ అధికారులు స్కూల్‌ డ్రెస్స్‌లు కుట్టడానికి మహిళా సంఘాలకు అందజేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సమగ్ర స్వరూపాన్ని డిజిటలైజేషన్‌ చేసేందుకు గతంలోనే ‘యూ డైస్‌ ప్లస్‌’ వంటి కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు తమ చరవాణుల్లో సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేవారు. ఈ విధానంతో కొంతమేరకు ఇబ్బందులు ఎదురయ్యేవని, ప్రత్యేకంగా ట్యాబ్‌లు పంపిణీ చేయాలని గతంలో పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ట్యాబ్‌లు సరఫరా చేసింది.

జిల్లాకు 294 ట్యాబ్‌లు..

భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల్లో మొత్తం 319 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 44 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లాలోని 44 యూపీఎస్‌లకు ట్యాబ్‌లు 44 మంజూరు కాగా 319 పీఎస్‌లకు మొత్తం 250 వరకు ట్యాబ్‌లు వచ్చాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మొత్తం జిల్లాకు 294 ట్యాబ్‌లు కేటాయించారు. వీటిని డీఈవో కార్యాలయంలోనే నిల్వ చేశారు. వీటి పంపిణీ కోసం ఇంకా స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. 150 కంటే ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలలకు రెండేసి ట్యాబ్‌లు ఇస్తారు. ట్యాబ్‌ల వినియోగంపై మొదట జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమగ్ర శిక్షణ అధికారులు శిక్షణ ఇస్తారు. అనంతరం ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు తర్ఫీదునిచ్చి ట్యాబ్‌లు అందజేయనున్నారు. ‘తొలిమెట్టు’లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, మధ్యాహ్న భోజన పథకం, బాలబాలికల వివరాలు, మన ఊరు-మన బడి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఐఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌, చైల్డ్‌ఇన్ఫో తదితర పూర్తి సమాచారాన్ని ట్యాబ్‌లలో పొందుపర్చనున్నారు.

తగ్గనున్న ఇబ్బందులు..

ఇంత వరకు పాఠశాలల్లో సమాచారాన్ని ఉపాధ్యాయులు వారి చరవాణుల్లో ఆన్‌లైన్‌ చేసేటప్పుడు చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యేవి.. నేడు ఈ ట్యాబ్‌ల పంపిణీతో ఇబ్బందులు తొలగిపోనున్నాయని పలువురు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబ్‌ల కారణంగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, సంక్షేమం గురించి వెంటనే తెలియపర్చడానికి అనుకూలంగా ఉంటుంది. యూ డైస్‌ ప్లస్‌లో ఎన్ని రకాల సమాచారం ఉంటుందో ట్యాబ్‌ల్లోనూ అంత సమాచారం నమోదుకు చేసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు