logo

ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉండాలి

జిల్లా ఆసుపత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటేనే ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలందుతాయని ఐటీడీఏ పీవో అంకిత్‌ అన్నారు.

Published : 01 Apr 2023 04:11 IST

వైద్యాధికారులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో అంకిత్‌

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: జిల్లా ఆసుపత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటేనే ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలందుతాయని ఐటీడీఏ పీవో అంకిత్‌ అన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం ఆయన జిల్లా వైద్యాధికారులతో సమీక్షించారు. జిల్లా ఆసుపత్రి, సామాజిక ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్‌, కాంట్రాక్టు, పొరుగు సేవలపై పని చేస్తున్న సిబ్బంది పనితీరును ప్రతి వారం సమీక్షించాలన్నారు. రోగులకందుతున్న సేవలకనుగునంగా పొరుగు సేవల సిబ్బందిని కొనసాగించాలన్నారు. జిల్లాలోని 15 పీహెచ్‌సీల్లో తాత్కాలికంగా పని చేసే స్టాఫ్‌నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, ఎక్స్‌రే టెక్నీషియన్‌, ఫార్మసిస్టులు, కాంటింజెంట్‌ వర్కర్ల పనితీరు నివేదిక ఇవ్వాలన్నారు. ఆరోగ్య మహిళ కేంద్రంలో నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ లక్షణాలు, అనుమానిత సుఖ వ్యాధులు, పీసీఓడీ, యూటీఐ ఉన్నట్లైతే త్వరితగతిన వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందిస్తే మరణాల సంఖ్య తగ్గించవచ్చన్నారు. రక్తపోటు, మధుమేహం వంటి అసాంక్రమిక వ్యాధిగ్రస్థులకు నిరంతరాయంగా మందులు అందిస్తూ వారి వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయాలని చెప్పారు. గర్భవతులు సీహెచ్‌సీ, జిల్లా ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకునేలా ప్రోత్సహిస్తూ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేసి కేసీఆర్‌ కిట్లు అందించాలన్నారు. ఏటూరునాగారం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్మిస్తున్న టీ-హబ్‌ సిబ్బంది కోసం ప్రతిపాదనలు పంపాలని సూపరింటెండెంట్‌ డా.ఎం.సురేష్‌కుమార్‌ను ఆదేశించారు. జిల్లా వైద్యాధికారులు అల్లెం అప్పయ్య, పాలకర్తి జగదీశ్వర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో కోరం క్రాంతికుమార్‌, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి పోరిక రవీందర్‌, జిల్లా అసాంక్రమిక వ్యాధుల ప్రోగ్రాం అధికారి ఎం.వెంకటేశ్వర్‌రావు, ఎంహెచ్‌ఎన్‌ ప్రోగ్రాం అధికారి పవన్‌కుమార్‌, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం మేనేజర్‌ ఆర్‌.మహేందర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని