logo

గ్రంథాలయాల రూపురేఖలు మారుస్తాం

జిల్లాలోని ప్రభుత్వ గ్రంథాలయాల రూపురేఖలు మార్చివేస్తానని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్‌ పోరిక గోవింద్‌నాయక్‌ హామీ ఇచ్చారు. మూతపడిన గ్రంథాలయాలను తెరిపించి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు.

Published : 01 Apr 2023 04:11 IST

వెంకటాపురం గ్రంథాలయాన్ని పరిశీలిస్తున్న ఛైర్మన్‌ గోవింద్‌నాయక్‌

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ గ్రంథాలయాల రూపురేఖలు మార్చివేస్తానని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్‌ పోరిక గోవింద్‌నాయక్‌ హామీ ఇచ్చారు. మూతపడిన గ్రంథాలయాలను తెరిపించి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. శుక్రవారం ఆయన ఏటూరునాగారం గ్రంథాలయాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో ఐటీడీఏ పీవో సాయంతో భవనాలకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. త్వరలో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను, కుర్చీలు, బల్లల వంటి సామగ్రిని సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక గ్రంథపాలకుడు ఎండీ.యాకూబ్‌పాషా పాల్గొన్నారు.

వెంకటాపురం: విజ్ఞాన భాండాగారంగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతామని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ గోవింద్‌నాయక్‌ అన్నారు. వెంకటాపురం మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. కనీసం దస్త్రాలు, పోటీ పరీక్షల పుస్తకాలు లేకపోవడంతో తాత్కాలిక స్వీపర్‌ను ప్రశ్నించారు. నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ మధుసూదన్‌ రూ.15 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని తహసీల్దారు ఎ.నాగరాజును కోరారు. జడ్పీటీసీ సభ్యురాలు రమణ, భారాస మండల అధ్యక్షుడు రాంబాబు, మండల కార్యదర్శి పి.మురళి పాల్గొన్నారు.

వాజేడు: మండలకేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ గోవింద్‌నాయక్‌ తనిఖీ చేశారు. నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలానికి సంబంధించిన పత్రాలను తహసీల్దారు లక్ష్మణ్‌ నుంచి తీసుకున్నారు. భారాస మండలశాఖ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు నిజాముద్దీన్‌, నాగారం ఉపసర్పంచి సతీశ్‌, అధికార ప్రతినిధి ఎల్లయ్య, ప్రచార కార్యదర్శి సాంబశివరావు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని