logo

‘వేం’ కుటుంబానికి అండగా ఉంటాం

కేసముద్రం జడ్పీటీసీˆ మాజీ సభ్యుడు వేం పురుషోత్తమ్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated : 29 May 2023 04:58 IST

నరేందర్‌రెడ్డిని ఓదార్చుతున్న రేవంత్‌రెడ్డి

రంగంపేట, న్యూస్‌టుడే: కేసముద్రం జడ్పీటీసీ మాజీ సభ్యుడు వేం పురుషోత్తమ్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. నా మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి విషాదంలో ఉన్నారని, వేం కుటుంబానికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నారు. ఆదివారం మధ్యాహ్నం హంటర్‌ రోడ్‌లో పురుషోత్తమ్‌రెడ్డి భౌతికకాయానికి పూల మాలాలేసి నివాళులర్పించారు. రేవంత్‌ను చూసి నరేందర్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. రేవంత్‌ దగ్గరకు తీసుకొని సర్ది చెప్పి, నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? అమెరికా నుంచి పురుషోత్తమ్‌రెడ్డి కుమారుడు ఎప్పుడొస్తారు అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి.. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లపై రేవంత్‌ ఆరా తీశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విలేకరులతో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పురుషోత్తమ్‌రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌ ప్రగాఢ సానుభూతి తెలుపుతోందన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, వరంగల్‌, హనుమకొండ, జనగామ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, గీసుకొండ ఎంపీపీ సౌజన్య, రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు పురుషోత్తమ్‌రెడ్డి భౌతికకాయానికి పూలమాలలేసి నివాళులర్పించారు.

మీడియా సమావేశానికి రాకుండానే..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పర్యటన వేం కుటుంబం పరామర్శకే పరిమితమైంది. తిరుగు ప్రయాణంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయానికి వస్తారని, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడతారని సమాచారం ఇచ్చారు. తర్వాత ఏమైందో గాని హంటర్‌రోడ్‌ నుంచి నేరుగా హైదరాబాద్‌ వైపు వాహనాలు వెళ్లాయి. ఒకరిద్దరు జిల్లా నాయకులు రేవంత్‌ను తమ ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎక్కడికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. అంతకు ముందు డీసీసీ అధ్యక్షులు, జిల్లా నాయకులు రేవంత్‌కు స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని