logo

భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన భర్త సెల్ఫీ వీడియోలో తన వేదన వినిపిస్తూ.. ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి మంగళవారం రాత్రి మరణించారు.

Published : 01 Jun 2023 03:26 IST

కేసముద్రం, న్యూస్‌టుడే: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన భర్త సెల్ఫీ వీడియోలో తన వేదన వినిపిస్తూ.. ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి మంగళవారం రాత్రి మరణించారు. ఈ విషాద ఘటన కేసముద్రం మండలం ధర్మారం తండా శివారు వెంక్యాతండాలో జరగగా బుధవారం పోలీసులు అయిదుగురిపై కేసు నమోదు చేశారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల మేరకు.. వెంక్యాతండాకు చెందిన బానోతు అశోక్‌(24)కు మహబూబాబాద్‌ మండలం ముత్యాలమ్మ తండాకు చెందిన బేబితో ఏడాది కిందట వివాహం జరిగింది. గర్భం ధరించడంతో పుట్టింటికి వెళ్లారు. ప్రస్తుతం నాలుగు నెలల కుమారుడు ఉన్నారు. భార్య, కొడుకును తీసుకొచ్చేందుకు బానోతు అశోక్‌ ఈ నెల 26న ముత్యాలమ్మతండాకు వెళ్లారు. ఆమె కాపురానికి రాకపోగా అత్త సంత్రి, మామ ఆనంద్‌, తోడల్లుడు నరేశ్‌, వదిన రజితలు అశోక్‌ను అవమానకరంగా దూషించారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన అశోక్‌ తీవ్రమనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 28న సెల్ఫీ వీడియోలో తన బాధను వెలిబుచ్చుతూ భార్యను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో చేర్చగా పరిస్థితి విషమించింది. మంగళవారం రాత్రి వరంగల్‌ ఎంజీఎం వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందారు. ఆత్మహత్యకు ముందు అశోక్‌ పురుగుల మందు డబ్బా పట్టుకొని సెల్ఫీ వీడియోలో తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలపడం చర్చనీయాంశమైంది. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు అశోక్‌ భార్య, అత్త, మామ, వదిన, తోటి అల్లుడిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని