logo

ఏఎన్‌ఎంలకు రక్తపోటు పరీక్షల కిట్లు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైద్య సిబ్బంది ఇళ్లకే వచ్చి ప్రజల రక్తపోటు స్థాయిని పరీక్షించి ఏ మందులు వాడాలో సూచిస్తారు.

Published : 01 Jun 2023 03:26 IST

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైద్య సిబ్బంది ఇళ్లకే వచ్చి ప్రజల రక్తపోటు స్థాయిని పరీక్షించి ఏ మందులు వాడాలో సూచిస్తారు.

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు రక్తపోటు, మధుమేహం వంటి రుగ్మతలు వస్తున్నాయి. వీటిని సకాలంలో గుర్తించక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. బాధితులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఏఎన్‌ఎంలకు డిజిటల్‌ రక్తపోటు నిర్ధారణ కిట్లను అందించి ప్రజలను చైతన్యవంతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

జిల్లాకు చేరిన పరికరాలు

ఈ పరికరాలు మంగళవారం జనగామ జిల్లా కేంద్రానికి చేరాయి. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది  ఉత్సవాల్లో భాగంగా వీటిని ఏఎన్‌ఎంలకు అందజేయనున్నారు. జిల్లాలో సుమారు 150 మంది ఏఎన్‌ఎంలు ఉన్నారు. ప్రస్తుతం గర్భిణుల ఆరోగ్య పరిరక్షణలో వీరు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. దీనికి తోడుగా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలకు రక్తపోటు పరీక్షలు చేస్తారు. బాధితుల వివరాలను సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందజేస్తారు. ఆరోగ్య కేంద్రాలకు చేరాక అక్కడి వైద్యులు బాధితులను మరోసారి పరీక్షించి వివరాలు నమోదు చేసుకొని ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. అవసరమైన మందులను అందిస్తారు.

ఇప్పుడేం జరుగుతోంది?

బాధితులు ఆసుపత్రుల్లో చేరిన తర్వాత రక్తపోటును నిర్ధారించి మందులు ఇస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకొని మందులను వైద్యుడికి చూపించాలని చెబుతున్నా.. బాధితులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం రక్తపోటు స్థాయిని కూడా గమనించలేకపోతున్నారు. దీంతో జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపి ఒక్కోసారి ప్రాణాల మీదికి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇకపై ఇలా..

ఏఎన్‌ఎంలకు డిజిటల్‌ బీపీ యంత్రాలను అందించడంతో వారు బాధితులను గుర్తించి వారి వివరాలను  పీహెచ్‌సీకి పంపిస్తారు. అక్కడి వైద్యులు మరింత లోతుగా పరీక్షించి మందులు రాస్తారు. వీటిని క్రమం తప్పకుండా వాడేలా ఏఎన్‌ఎంలు కుటుంబ సభ్యులకు వివరిస్తారు. వారు రోజూ మందులు వేసుకుంటున్నారో లేదో ఆరా తీస్తారు. ప్రతి మూడు నెలలకోసారి పరీక్షలు చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు. మందులు కొనసాగించాలా మార్చాలా అన్నది అక్కడి వైద్యులు సూచించి మందులు అందిస్తారు.


ఈ కార్యక్రమంతో బాధితులకు ఉపశమనం

- ప్రశాంత్‌, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి

ఏఎన్‌ఎంలకు బీపీ పరీక్షల కిట్లు ఇవ్వనున్నట్లు సమాచారం అందింది. చాపకింద నీరులా విస్తరిస్తున్న రక్తపోటును గుర్తించి మందులు వాడకుంటే పెను ప్రమాదాలకు దారి తీస్తుంది. ప్రభుత్వ విధానంతో చాలామంది రక్తపోటు బాధితులకు ఉపశమనం కలుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని