logo

విభిన్న రంగాలు వికసించాలి.. ఆకాంక్షలు నెరవేరాలి

స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏట అడుగు పెడుతున్న వేళ రాబోయే పదేళ్లలో సాధించాల్సిన ప్రగతిపై జిల్లా వాసులు తమ విలువైన సూచనలు ఇచ్చారు.

Published : 02 Jun 2023 02:55 IST

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

వరంగల్‌ శివనగర్‌,  న్యూస్‌టుడే: స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏట అడుగు పెడుతున్న వేళ రాబోయే పదేళ్లలో సాధించాల్సిన ప్రగతిపై జిల్లా వాసులు తమ విలువైన సూచనలు ఇచ్చారు. ఈనాడు ‘వాట్సాప్‌’ పిలుపునకు స్పందన లభించింది. పేదలకు ప్రగతి ఫలాలు అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో దేశానికే ఆదర్శంగా నిలివాలని కోరారు. జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. పాఠకులు, ప్రజలు, విద్యావేత్తలు, వివిధ రంగాలకు చెందిన వారు అందించిన సూచనలు ఇలా ఉన్నాయి.


పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి

వరంగల్‌ కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. ఇతర దేశాల వారిని ఆకట్టుకునేలా సౌకర్యాలు కల్పించాలి. కోట చుట్టూ బోటింగ్‌ ఏర్పాటు చేయాలి. భద్రకాళీ ఆలయం నుంచి వన విజ్ఞాన్‌ వరకు రోప్‌వే నిర్మించే అవకాశం ఉంది.

మండల పరుశురాములు, అభ్యుదయసేవాసమితి, రంగశాయిపేట


వ్యవసాయరంగం కీలకం

వ్యవసాయ విధానాలపై రైతులకు శిక్షణ, రాయితీతో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసి, పంట ఉత్పత్తులను పెంచాలి. అందుకు తగ్గట్టుగా గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. భూమిని నమ్ముకున్న రైతుకు ధీమా కల్పించాలి. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

కుడ్ల శ్రీనివాస్‌, శివనగర్‌, వరంగల్‌


ఆధ్యాత్మిక నగరంగా మార్చాలి

ఆలయాలను అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక నగరంగా మారిస్తే బాగుంటుంది. ఔటర్‌రింగ్‌ రోడ్లు, విమానాశ్రయం, విశాలమైన కూడళ్లు, ఉద్యానవనాలు, రోడ్డుకిరువైపులా చెట్లు పెంచి ఆకర్షణీయంగా మార్చాలి.

ఏల్పుల కుమార్‌యదవ్‌, ఎల్లమ్మబజార్‌, వరంగల్‌


ఐటీ పరిశ్రమలు అవసరం

ఐటీ పరిశ్రమలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. ఇక్కడ ఐటీ పార్కు ఉంటే ఇక్కడ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకి వెళ్లాల్సిన అవసరం రాదు. ఐటి ఉద్యోగులు ఇక్కడే సంపాదించి ఇక్కడే ఖర్చుచేస్తారు. స్థానికంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మందికి ఉపయోగంగా ఉంటుంది.

బక్క కవిత, విద్యార్థిని, ఏకశిలానగర్‌, వరంగల్‌


విజన్‌-2033పై కార్టూన్‌

పారిశ్రామికంగా, వ్యవసాయ, పర్యాటక, వైమానిక రవాణా రంగాలతోపాటు, విద్య,వైద్యం, ఉపాధి అవకాశాలతో వెలుగొందాలని వరంగల్‌ జిల్లా బొల్లికుంటకు చెందిన కార్టూనిస్టు చదువాల చంద్ర కార్టూన్‌ గీసి చాటిచెప్పారు..


క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తే మేలు

క్రీడామైదానాలు, పార్కులు ఏర్పాటు చేయాలి. విజ్ఞానాన్ని పెంపొందించే గ్రంథాలయాలు కాలనీల్లో ప్రారంభించారు. యోగా, ధ్యానకేంద్రాలు అందుబాటులోకి తేవాలి.

డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, రామన్నపేట, వరంగల్‌


విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలి

ఇక్కడి విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే విద్యావకాశాలు మెరుగుపర్చాలి. ఉపాధినిచ్చే కోర్సులను అందుబాటులోకి తేవాలి. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా రంగంలో మార్పులు తేవాలి.

అచ్చ వినోద్‌కుమార్‌, సామాజిక వేత్త, విద్యానగర్‌కాలనీ, వరంగల్‌ ఫోర్టురోడ్డు


వైద్యరంగంలో మార్పులు

వైద్య రంగంలో మార్పులు రావాల్సిన అవసరం చాలా ఉంది. హైదరాబాద్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఆదివారం రోజు వైద్యులు అందుబాటులో ఉండక ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. భవిష్యత్తులో ఇలా ఉండకుండా మెరుగైన వైద్యం ప్రజలకు అందేలా అభివృద్ధి జరగాలి.

తాటికొండ శైలజ, శివనగర్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు