logo

వెదజల్లాలి మానవత్వ పరిమళాలు!

ఆపదలో ఆదుకోవడం, అత్యవసర సమయాల్లో మేమున్నామని వెంట నిలవడం ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటన మనకు నేర్పుతోంది. ఈ ఘటనలో గాయపడిన వందలాది మందికి చికిత్స కోసం

Published : 04 Jun 2023 05:19 IST

ఓరుగల్లు ప్రమాదాలను గుర్తు చేసిన కోరమండల్‌ రైలు దుర్ఘటన
ఆ రెండు  సంఘటనల్లోనూ..

ఆపదలో ఆదుకోవడం, అత్యవసర సమయాల్లో మేమున్నామని వెంట నిలవడం ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటన మనకు నేర్పుతోంది. ఈ ఘటనలో గాయపడిన వందలాది మందికి చికిత్స కోసం అవసరమైన రక్తం ఇవ్వడానికి వేలాది మంది ముందుకొచ్చిన తీరు మానవత్వం ఇంకా బతికే ఉందని చాటి చెప్పింది. గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదాలను ఇది గుర్తుచేసింది. ఆ సమయాల్లో ఓరుగల్లువాసులు గొప్పగా స్పందించారు.  ఇలాంటి అత్యవసర సమయాల్లో ఇలా అందరూ మానవత్వంతో స్పందించాలి 

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే


2003 జులై 2.. ఉదయం

గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో  నిలిపే క్రమంలో బ్రేక్‌లు విఫలమవడంతో లూప్‌లైన్‌లో మళ్లించారు. రైలు ఆగకుండా వరంగల్‌ శివనగర్‌ రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద పడిపోయింది. ఈ దుర్ఘటనలో 22 మంది మరణించగా, 110 మందిపైగా గాయపడ్డారు. ఆనాడు బాధితులను ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చగా నగరవాసులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తం అందించి మానవత్వం చాటుకున్నారు. రైలు బోగీల్లో చిక్కుకున్న వారిని స్థానికులు బయటకు తీసి రక్షించారు.


2008 ఆగస్టు 1.. తెల్లవారుజామున

మహబూబాబాద్‌- తాళ్లపూసలపల్లి రైల్వేస్టేషన్‌ మధ్య సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ వెళ్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-9 బోగీలో చెలరేగిన మంటలు రైల్లోని చాలా బోగిలకు వ్యాపించి భారీ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 32 మంది మరణించగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చగా స్థానికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్త దానం చేశారు.


మా అవసరం పడలేదు

ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడమే మా సంస్థ ప్రధాన ఉద్దేశం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 25 వేల మంది సభ్యులున్నారు. ఇప్పటివరకు అత్యవసర సమయాల్లో 5,442 మంది బాధితులకు రక్తదానం చేసి ప్రాణం పోశాం. ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాద బాధితులకు రక్తం అందించడానికి ఆంధ్రప్రదేశ్‌ సభ్యులు ముందుకొచ్చారు. అక్కడి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు రావడం వల్ల మావాళ్లు వెళ్లలేదు.

కొత్తకొండ అరుణ్‌కుమార్‌, అధ్యక్షుడు, యువ నేతాజీ ఫౌండేషన్‌


కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో గాయపడినవారి కోసం శుక్రవారం అర్ధరాత్రి బాలేశ్వర్‌ ఆసుపత్రిలో రక్తదానం చేస్తున్న యువకులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు