logo

ఆహారోత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తాం

వరంగల్‌ జిల్లాలో రూ.100 కోట్లతో ఆహారోత్పత్తుల తయారీ కేంద్రం(ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌) ఏర్పాటు చేస్తామని, ఇందుకు అవసరమైన స్థల సేకరణ పూర్తిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లా పాలనాధికారి ప్రావీణ్యకు సూచించారు.

Updated : 04 Jun 2023 05:46 IST

రైతు దినోత్సవ సభలో మంత్రి ఎర్రబెల్లి వెల్లడి

జ్యోతివెలిగిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

ఎనుమాముల మార్కెట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లాలో రూ.100 కోట్లతో ఆహారోత్పత్తుల తయారీ కేంద్రం(ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌) ఏర్పాటు చేస్తామని, ఇందుకు అవసరమైన స్థల సేకరణ పూర్తిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లా పాలనాధికారి ప్రావీణ్యకు సూచించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లోని పత్తి యార్డులో శనివారం మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు జ్యోతి వెలిగించి సమావేశాన్ని ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. గత ప్రభుత్వాల కాలంలో రైతులు కరెంటు కష్టాలతో తల్లడిల్లేవారని, ప్రత్యేక రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరాతో రైతుల పరిస్థితి మారిందన్నారు. ప్రస్తుతం  రైతులు తమ పంట కాలాన్ని నెల రోజులు ముందుకు తీసుకురావాలని, వానాకాలం పంటలను జూన్‌ 15 లోపు, యాసంగి పంటలను నవంబరు 10లోపు వేయాలని సూచించారు. తద్వారా అకాల వర్షాల నుంచి పంటలను  రక్షించుకోవచ్చన్నారు. దొడ్డు రకం ధాన్యం పండించడం వల్ల నష్టాలు చవిచూస్తున్నారని.. కొత్త వంగడాలు, సన్నరకం ధాన్యం రైతులు సాగు చేయడం ద్వారా లాభాలు గడించవచ్చన్నారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ జిల్లాలో పత్తి రిసోర్స్‌ కేంద్రం, స్పైసెస్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబ్‌, ఆగ్రో బేస్డ్‌ జోన్స్‌, రూ.2 కోట్లతో ఎయిర్‌ కండిషన్‌ ఫిష్‌ మార్కెట్ల ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. ఛాంబర్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ మార్కెట్‌ ఆదాయంలో 30- 40 శాతం మార్కెట్‌ అభివృద్ధికి ఖర్చుచేయాలన్నారు. ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, నన్నపునేని నరేందర్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గండ్రజ్యోతి, పాలనాధికారి ప్రావీణ్య, సీపీ ఏవీ.రంగనాథ్‌ మాట్లాడారు. పలువురు రైతులను సన్మానించారు. మార్కెట్‌ ఛైర్‌పర్సన్‌ దిడ్డి భాగ్యలక్ష్మి అదనపు కలెక్టర్లు శ్రీవత్స, అశ్వినీ తానాజీ, కార్యదర్శి రాహుల్‌, జేడీఎం మల్లేషం, డీడీఎం రాజు, డీఎంవో ప్రసాద్‌రావు, రైతుబంధు సమితి అధ్యక్షురాలు లలితాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ్లెక్సీల్లో ఫొటోల రగడ

రైతు దినోత్సవం సందర్భంగా మార్కెట్‌లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో ముద్రించిన ఫొటోల విషయంలో శనివారం ఉదయం ఛాంబర్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మార్కెట్‌ కార్యదర్శి రాహుల్‌ను నిలదీశారు. మార్కెట్‌ ఛైర్‌పర్సన్‌ దిడ్డి భాగ్యలక్ష్మి అయితే ఆమె భర్త ఫొటో ఫ్లెక్సీలో ఎందుకు వేశారని అడిగారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి ఫొటో ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. సమావేశం ప్రారంభంలోనే ఈ విషయంలో వాడివేడీ సంభాషణలు జరగడంతో సభా ప్రాంగణమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పండగలా మారిన వ్యవసాయం

రాయపర్తి: ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, ఉచిత విద్యుత్తు తదితర సంక్షేమ పథకాలతో వ్యవసాయం పండగలా మారిందని కలెక్టర్‌ ప్రావీణ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రాయపర్తి, పెర్కవేడు, మొరిపిరాల, కాట్రపల్లి, కేశవాపూర్‌లోని రైతు వేదికల్లో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్‌తో కలిసి కలెక్టర్‌ మాట్లాడారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కోలాటం ప్రదర్శనలతో ర్యాలీ నిర్వహించారు. ఉత్తమ రైతులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిమిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కుమార్‌గౌడ్‌, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని