logo

రెండో విడత గొర్రెల పంపిణీకి సన్నాహాలు

యాదవులు, కురుమల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటికే మొదటి విడతలో కొందరికి గొర్రెల యూనిట్లను అందజేశారు.

Updated : 04 Jun 2023 05:46 IST

జనగామరూరల్‌, న్యూస్‌టుడే: యాదవులు, కురుమల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటికే మొదటి విడతలో కొందరికి గొర్రెల యూనిట్లను అందజేశారు. రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని మండలాలు, గ్రామాల వారీగా పంపిణీ ప్రణాళికపై పశుసంవర్ధక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

కార్యాచరణకు రూపకల్పన

రాష్ట్ర ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 21,703 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.  మొదటి విడతలో దశల వారీగా 10,520 మందికి గొర్రెలు అందజేశారు. ఒక్కో యూనిట్‌కు 20 ఆడ గొర్రెలు, 1 పొట్టేలు చొప్పున అందజేశారు. రెండో విడతలో 5,755 మందికి అప్పట్లోనే గొర్రెలు పంపిణీ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేక పోవడంతో పంపిణీ నిలిచిపోయింది. ప్రసుత్తం ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో మిగిలిన 4,499 మందికి గొర్రెలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. వీరిలో 2,540 మంది డీడీలు చెల్లించారు. జిల్లాకు అవసరమైన గొర్రెలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు పరిశీలిస్తున్నారు.

పటిష్ఠ చర్యలు..

రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులకు  గొర్రెలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. లబ్ధిదారుల కుల, ఆధార్‌, బ్యాంకు, నామినీ పత్రాలను సేకరిస్తున్నారు. ఒక వేళ లబ్ధిదారుడు చనిపోతే నామినీగా ఉన్న భార్య లేదా కుమారులకు అందజేయనున్నారు. పూర్తి వివరాలను ఈ ల్యాబ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. గతంలో మండలస్థాయి అధికారుల పర్యవేక్షణలో గొర్రెల కొనుగోళ్లు జరిగాయి. ఈ సారి గతంలో మాదిరిగా కాకుండా జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పారదర్శకత కోసం జీపీఎస్‌ విధానం ఉన్న వాహనాల్లోనే జీవాలను రవాణా చేయనున్నారు.

పెరిగిన యూనిట్‌ విలువ

గతంతో పోలిస్తే గొర్రెల యూనిట్‌ ధర పెరిగింది. మొదటి విడత సమయంలో గొర్రెల యూనిట్‌ విలువ రూ.1.25 లక్షలు ఉంది. లబ్ధిదారుల వాటా రూ.31,250 కాగా మిగతా సొమ్మును ప్రభుత్వం భరించింది. ప్రసుత్తం యూనిట్‌ విలువ రూ.1.75 లక్షలకు చేరింది. దీంతో లబ్ధిదారుల వాటా రూ.43,750కు చేరగా, గతంతో పోలిస్తే రూ.12,500 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. లబ్ధిదారులు తమ వాటా మొత్తాన్ని ఆన్‌లైన్‌లో నేరుగా జమ చేస్తున్నారు. పలు మండలాల్లో లబ్ధిదారులతో మండల పశు సంవర్ధకశాఖ అధికారులు సమావేశమై వాటా చెల్లింపులు, ఆన్‌లైన్‌ చేసుకునే విధానం, అందించాల్సిన ధ్రువీకరణ పత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు.

9న ప్రారంభిస్తాం

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీని కార్యక్రమం ఈనెల 9న ప్రారంభం కానుంది.  జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ కేంద్రాల్లో పంపిణీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 4499 మంది లబ్ధిదారుల్లో 2,540 మంది డీడీలు చెల్లించగా.. రోజు వారీగా డీడీల చెల్లింపుల ప్రక్రియ నడుస్తోంది.

మనోహర్‌, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని