logo

సైబర్‌, మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం

రోజురోజుకు పెరుగుతున్న సైబర్‌ నేరాలతో పాటు మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది.

Published : 07 Jun 2023 04:29 IST

కమిషనరేట్‌కు నూతనంగా రెండు ఠాణాలు
న్యూస్‌టుడే, వరంగల్‌ క్రైం

రోజురోజుకు పెరుగుతున్న సైబర్‌ నేరాలతో పాటు మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్‌ బ్యూరో (టీఎస్‌న్యాబ్‌), తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక ఠాణాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌కు ప్రత్యేకంగా సైబర్‌ ఠాణా, నార్కోటిక్‌ బ్యూరో ద్వారా మరో ఠాణా ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటి ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలని ఉన్నతాధికారులు సూచించారు. కొత్తగా ఏర్పాటయ్యే రెండు ఠాణాల నిర్వహణ ఏసీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. దీనికి అవసరమైన సిబ్బందిని నియమించే అవకాశాలున్నాయి. దీనిపై కమిషనరేట్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఠాణాల ఏర్పాటుకు స్థలాల అన్వేషణలో ఉన్నారు.

టీఎస్‌ న్యాబ్‌ ఠాణా ఏర్పాటైతే..

కమిషనరేట్‌లో కొత్తగా ఏర్పాటయ్యే టీస్‌ న్యాబ్‌ ఠాణా ద్వారా మాదక ద్రవ్యాలను నిరోధించడంతో పాటు వాటికి సంబంధించిన కేసులను నమోదు చేస్తారు. ఈ ఠాణాలోని అధికారులు కేసు విచారణ పూర్తి చేసి కోర్టులో అభియోగపత్రాలను దాఖలు చేస్తారు. దీంతో పాటు మాదక ద్రవ్యాలపై నిఘా పెంచి అక్రమ రవాణాను అరికట్టడం సులభం అవుతుంది. ఏసీపీతో పాటుగా ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలు, 38 వరకు సిబ్బంది ఈ ఠాణాలో ఉంటారు.

సైబర్‌ ఠాణా ఏర్పాటైతే

ఇప్పటి వరకు సైబర్‌ నేరాలు జరిగితే 1930కు కాల్‌ చేస్తే వివరాలు సేకరించి సంబంధిత ఠాణా పరిధిలో కేసులను నమోదు చేసేందుకు సిఫార్సు చేసేవారు. లేదా నేరుగా శాంతి భద్రతల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కేసు నమోదు చేస్తున్నారు. దీనివల్ల కేసు విచారణలో జాప్యం జరగడంతో పాటు బాధితులకు డబ్బులు తిరిగి వచ్చేందుకు చాలా సమయం పట్టేది. సైబర్‌ ఠాణా ఏర్పాటైతే నేరుగా బాధితుడు ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు. లేదా 1930 నంబర్‌కు కాల్‌ చేసినా సైబర్‌ విభాగానికి సమాచారం అందడం, వెంటనే కేసు విచారణ చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా నైపుణ్యం గల సిబ్బంది ఉండడంతో కేసు విచారణ త్వరితగతిన పూర్తవుతుంది. బాధితులకు సకాలంలో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటంతో కేసులను త్వరితగతిన ఛేదించేందుకు అవకాశం ఉంటుంది. సైబర్‌ ఠాణాలో ఏసీపీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలతో పాటు 40 మంది వరకు సిబ్బంది ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని