logo

నాయకత్వ లక్షణాలపై ఆన్‌లైన్‌ శిక్షణ

వేసవి సెలవులు ముగిసి మరో వారం రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. జిల్లాలో ఇప్పటికే బడిబాటకు శ్రీకారం చుట్టారు.

Updated : 07 Jun 2023 05:35 IST

డోర్నకల్‌, న్యూస్‌టుడే:  వేసవి సెలవులు ముగిసి మరో వారం రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. జిల్లాలో ఇప్పటికే బడిబాటకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పాఠశాల నిర్వహణ అంశంపై ఒక ఆన్‌లైన్‌ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్పుతో కూడిన బోధన, ఉపాధ్యాయుల భాగస్వామ్యం పెంచడం, సూక్ష్మ దృష్టి లక్ష్యంగా ఎంహెచ్‌ఆర్‌డీ (కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ) ఆధ్వర్యంలో జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన (న్యూపా) ఈ ఆన్‌లైన్‌ కోర్సు నిర్వహణకు సంకల్పించింది. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్‌ స్కూళ్లు, గురుకులాలతో పాటు జూనియర్‌ కళాశాలల ప్రధానోపాధ్యాయులు, పిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు యూడైస్‌ కోడ్‌తో పేర్లు నమోదు చేసుకుని శిక్షణలో భాగస్వామ్యమయ్యే వీలు కల్పించారు.

విద్యా ప్రమాణాలు పెంచేందుకే..

కొవిడ్‌-19 తర్వాత జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదు పెరిగింది. వివిధ రకాల ఉచిత పథకాల అమలుకు తోడు ‘మన ఊరు-మన బడి’ కింద ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయిలో  ప్రభుత్వం వసతులు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలోని 1025 బడుల్లో లక్ష మందికి పైగా విద్యార్థులుండగా వీరికి బోధించడానికి సుమారు 5 వేల మంది ఉపాధ్యాయులున్నారు. పాఠశాలల్లో నాణ్యత ప్రమాణాలు, ఉత్తమ ఫలితాల సాధన ఆశించిన మేరకు ఉండటం లేదు. దీనిని పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు నాయకత్వం, సమర్థ నిర్వహణ, అభివృద్ధి అనే అంశాలపై ఆన్‌లైన్‌ కోర్సు ప్రారంభించింది. ఇందులో బడుల నాయకత్వ దృక్పథం, స్వీయ అభివృద్ధి, బోధన అభ్యసన ప్రక్రియను మార్చడం, బిల్డింగ్‌, లీడింగ్‌ బృందాల సృష్టి, ప్రముఖుల ఆవిష్కరణలు, ప్రముఖుల భాగస్వామ్యాల పాఠశాల పరిపాలన, బడి అభివృద్ధి ప్రణాళికను ఏకీకృతం చేయడం వంటి అంశాలపై శిక్షణ ఉంటుంది. వీటిని ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటే వారిలో ప్రమాణాలు పెరుగుతాయనేది కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. విజయవంతంగా శిక్షణ పూర్తిచేస్తే ఆన్‌లైన్‌ ధ్రువపత్రం అందుతుంది.  

వెబ్‌సైట్‌ ఇదీ

శిక్షణ కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్‌ఎల్‌ఎం.ఎన్‌ఐఇపీఏ.ఏసీ.ఐఎన్‌ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. పేరు, వివరాలు, మెయిల్‌ ఐడీ, ఉద్యోగి సంఖ్య, చిరునామా తదితర వివరాలు నమోదు చేసుకోవాలి. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సిద్ధం చేయాలి. కోర్సు ప్రారంభమైన రోజు నుంచి వెబ్‌సైట్‌లో స్టడీ మెటీరియల్‌తో సబ్జెక్టులను చదువుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ చేసుకునే ప్రక్రియ మొదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని