logo

పన్నుల వసూలుపై కమిషనర్‌ ఆరా

ఆస్తి, నల్లా పన్ను, వ్యాపార అనుమతుల రుసుం వసూళ్లపై కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా ఆరా తీశారు.

Published : 08 Jun 2023 04:26 IST

నక్కలగుట్టలో వ్యాపార అనుమతుల రుసుం వసూళ్లను పరిశీలిస్తున్న కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే : ఆస్తి, నల్లా పన్ను, వ్యాపార అనుమతుల రుసుం వసూళ్లపై కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా ఆరా తీశారు. పన్నులు, వ్యాపార అనుమతుల రుసుం చెల్లిస్తామంటే బల్దియా ఉద్యోగులు తీసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు బుధవారం కాజీపేట సర్కిల్‌ సిబ్బంది, సీజీజీ నుంచి వచ్చిన నిపుణులతో కలిసి పలు కాలనీల్లో పర్యటించారు. ముందుగా నక్కలగుట్ట వార్డు కార్యాలయంలో పన్నుల విభాగం ఆర్‌ఐలు, బిల్‌ కలెక్టర్లతో కమిషనర్‌ మాట్లాడారు. పన్ను వివరాలు, చెల్లింపు రశీదులు తప్పుగా వస్తున్నాయని సిబ్బంది చెప్పడంతో వారం రోజుల్లో సాంకేతిక సమస్య పరిష్కరించాలని సీజీజీ ప్రతినిధులకు సూచించారు. అనంతరం ఎక్సైజ్‌, కనకదుర్గా, రామకృష్ణ కాలనీల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి పన్ను చెల్లింపు వివరాలు తెలుసుకున్నారు. ఎక్సైజ్‌ కాలనీలో ఆస్తిపేరు మార్పిడి చేయడం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు రావడంతో ఫిర్యాదు దారుని ఇంటికెళ్లి మాట్లాడారు. వ్యాపార అనుమతుల రుసుం దుకాణాల కొలతల ప్రకారం వసూలు చేస్తున్నారా అని నక్కలగుట్టలో కొన్ని దుకాణాలను కమిషనర్‌  పరిశీలించారు. వడ్డేపల్లి, రామకృష్ణ కాలనీలో ఎల్‌ఆర్‌ఎస్‌ స్థలాల పరిశీలన, సర్వే తీరును కమిషనర్‌ చూశారు. హనుమకొండలోని పలు కాలనీల్లోని ఖాళీ ప్లాట్లు వ్యర్థాలతో నిండాయని, స్థల యజమానులకు నోటీసులు జారీ చేసి జరిమానా విధించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇన్‌ఛార్జి అదనపు కమిషనర్‌ రషీˆద్‌, ఉప కమిషనర్‌ జోనా తదితరులు ఆయన వెంట ఉన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు