logo

ముందుకు సాగని బడిబాట

ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో తగినంత మంది విద్యార్థులు ఉండడం లేదు.

Published : 08 Jun 2023 04:52 IST

దశాబ్ది వేడుకల విధుల్లో ప్రధానోపాధ్యాయులు

చెరువుల పండగకు ఏర్పాట్లు చేయిస్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడు

‘ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరులోని బాలుర విద్యార్థి వసతిగృహంలో విద్యార్థులు లేకపోవడంతో త్వరలో దేవరుప్పుల వసతిగృహంలో విలీనం చేయాలనుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఆ హాస్టల్‌ వార్డెన్‌, సంబంధిత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గ్రామాల్లో తిరిగితే మరింత మంది విద్యార్థులు వసతిగృహంలో చేరే అవకాశం ఉండేది.’

జనగామ, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో తగినంత మంది విద్యార్థులు ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గ్రామాల్లో తిరిగి పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు వీలుగా ప్రభుత్వం బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిరుటి వరకు ఈ సంప్రదాయం కొనసాగింది. ఈ క్రమంలో ఈ నెల 22 వరకు నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల కోసం జనగామ జిల్లాలో 17 మంది జడ్పీ ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 13 మంది వసతిగృహ సంక్షేమాధికారులను ప్రభుత్వం గ్రామాలకు ప్రత్యేకాధికారులుగా నియమించింది. వీరు అసలు ఉద్యోగ ధర్మాన్ని వీడి ఇతర పనుల బాట పట్టారు. వీరు ఈ నెలంతా గ్రామాల్లో తిరిగి పిల్లలను బడిలో చేర్పించొచ్చు. అలాంటిది ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించడం సరికాదని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.  

12న ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం  

బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కలిసి వారి పిల్లలను తమ బడిలో చేర్పించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఉంటే ఆ ప్రభావం వేరే విధంగా ఉంటుంది.  మనఊరు మనబడి పథకంలో ప్రభుత్వం పలు ప్రాథమిక పాఠశాలల సుందరీకరణ, డిజిటల్‌ బోధన పేరిట ఉన్నత పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో తీర్చిదిద్దింది. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు రెండు జతల దుస్తులు, రోగనిరోధక శక్తి పెంచే రాగి జావ అందించనున్నారు. ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయులు వీటి గురించి వివరిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్పించే అవకాశం ఉంటుంది.


వీలు చూసుకొని వెళ్తున్నాం..

ఇదే విషయాన్ని ఒకరిద్దరు ప్రధానోపాధ్యాయులతో ప్రస్తావిస్తే.. ప్రధానంగా మూడు కార్యక్రమాల్లో తమ అవసరం ఉంటుందన్నారు. రైతు వేదికల్లో నిర్వహించే రైతు దినోత్సవం, చెరువుల పండగ, విద్యా దినోత్సవం సందర్భంగా హడావుడి ఉంటుందన్నారు. ప్రత్యేకాధికారులుగా పనిచేస్తున్నా, వీలు చూసుకొని పాఠశాలకు వెళ్తున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని