logo

‘ప్రజలకు కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి’

ములుగులో బుధవారం ప్రభుత్వం తరఫున అధికారికంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని,  ములుగు ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండు చేశారు.

Published : 09 Jun 2023 03:48 IST

ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే సీతక్క, చిత్రంలో కాంగ్రెస్‌ నాయకులు

ములుగు, న్యూస్‌టుడే: ములుగులో బుధవారం ప్రభుత్వం తరఫున అధికారికంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని,  ములుగు ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండు చేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. భారాస ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి హరీష్‌రావు సీతక్క అడిగితేనే మెడికల్‌ కళాశాల మంజూరు చేశామని చెప్పిన మాటలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న తనపై ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. అధికారిక సమావేశంలో రాజకీయాలు మాట్లాడడం తగదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని 2018 నుంచి పోరాటం చేస్తున్నామని అన్నారు. మల్లంపల్లి, రాజుపేట, లక్ష్మీదేవిపేటలను  మండలాలుగా మార్చాలనడం తప్పా అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం పని చేస్తానన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రవిచందర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఎండి.చాంద్‌పాషా, నాయకులు వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, శ్రీనివాస్‌, భరత్‌కుమార్‌, కుమార్‌, భిక్షపతి, రేవంత్‌, వంశీకృష్ణ, తిరుపతి పాల్గొన్నారు.

రైతుల ఇబ్బందులు తొలగించాలి

ములుగు: వర్షాలు పడకముందే ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సీతక్క గురువారం జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్యను కలిసి వినతిపత్రం అందించారు. పండించిన పంటను అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. తాలు, తేమ, తరుగు పేరుతో క్వింటాకు 5 నుంచి 10 కేజీలు కోత పెడుతున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలలో తూకం వేసి 20 రోజులు కావొస్తున్నా లారీల కొరత ఉందని గుత్తేదారు మొహం చాటేస్తున్నారని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని