logo

విసిగి వేసారి.. వ్యాపారులకు ధాన్యం విక్రయం!

రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి ·నేరుగా కొనుగోలు చేసేందుకు యాసంగిలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది.

Published : 09 Jun 2023 04:05 IST

గున్నేపల్లిలో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించిన ధాన్యం

దంతాలపల్లి (మరిపెడ), న్యూస్‌టుడే: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి ·నేరుగా కొనుగోలు చేసేందుకు యాసంగిలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది. పెద్ద ఎత్తున ధాన్యం రావడంతో కాంటాలు వేయడంలో తీవ్ర జాప్యం నెలకొంది. ఇటీవల అకాల వర్షాలు రావడంతో కేంద్రాల్లో పోసిన ధాన్యం తూర్పార పట్టడం, తేమ శాతం వచ్చేంత వరకు ఆరబెట్టడం అన్నదాతలకు తలకు మించిన భారంగా మారింది. తూకం వేసిన బస్తాలను మిల్లులకు పంపించేందుకు సకాలంలో లారీలు రాకపోవడం, తరలించిన ధాన్యం మిల్లుల వద్ద వెంటనే దిగుమతి కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. రైతులే వాహనాలను కిరాయి తీసుకుని మిల్లులకు తరలించిన ధాన్యాన్ని దింపుకునేందుకు మిల్లర్లు తేమ, ఇతర సాకులు చెబుతూ బస్తాకు మూడు నుంచి నాలుగు కిలోల కోత విధిస్తుండటంతో నష్టపోవాల్సి వస్తోంది. వీటికి తోడు విక్రయించిన ధాన్యానికి డబ్బులు వచ్చేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఆటుపోట్లతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు చివరికి కష్టాలు పడలేక ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు.

* దంతాలపల్లి మండలం గున్నేపల్లికి చెందిన పలువురు రైతులు పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వ్యాపారులకు క్వింటాలుకు రూ.1820 నుంచి రూ.1900 చొప్పున విక్రయించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని బస్తాల్లో తూకం వేసి వెంటనే వారికి చెందిన లారీల్లో రాజమండ్రికి తరలిస్తుండటంతో రైతులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించడం గమనార్హం.

* ఈ విషయాన్ని సొసైటీ సీఈవో వెంకన్న వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా కేంద్రంలో ఇంకా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిపారు. బస్తాల తరలించేందుకు వాహనాలు రాక కొంత జాప్యం జరుగుతుందన్నారు. లారీలు, ట్రాక్టర్లలో బస్తాలను మిల్లులకు తరలిస్తున్నామన్నారు. ఆలస్యమవుతుందనే భావనతో కొంత మంది ప్రైవేటుకు విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని