logo

కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమై వారం రోజులు గడిచింది. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.

Updated : 09 Jun 2023 05:31 IST

జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి సత్యనారాయణ

న్యూస్‌టుడే, మానుకోట: జిల్లాలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమై వారం రోజులు గడిచింది. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సర ప్రవేశాల కోసం జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు పదో తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరడం వల్ల కలిగే విద్యా సౌకర్యాలను వివరిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో (2023-24)లో విద్యార్థుల ప్రగతి కోసం చేపట్టనున్న చర్యలు, ప్రవేశాల పెంపు కోసం జరుగుతున్న కృషిపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) సమ్మెట సత్యనారాయణ ‘న్యూస్‌టుడే’ నిర్వహించిన ముఖాముఖిలో వివరించారు.

న్యూస్‌టుడే: జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సర ప్రవేశాల ప్రక్రియ ఎలా సాగుతోంది?

డీఐఈఓ: ఈ నెల ఒకటి నుంచి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ సంవత్సర ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియ నెలాఖరు వరకు కొనసాగనుంది. ప్రవేశాల సంఖ్యను పెంచేంఉదకు అధ్యాపకులు పల్లెల్లో సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని కోరుతున్నారు. ఇప్పటికీ జిల్లాలో 124 ప్రవేశాలు జరిగాయి.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వివిధ గ్రూపుల్లో సీట్ల లభ్యత ఎలా ఉంది?

డీఐఈఓ: ప్రతి కళాశాలలో ఆర్ట్స్‌, సైన్స్‌ గ్రూపులున్నాయి. మహబూబాబాద్‌ బాలుర, బాలికల, నెల్లికుదురు, తొర్రూరు కళాశాలల్లో వృత్తి విద్య కోర్సులు ఉన్నాయి. సాధారణ గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో 44 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వృత్తి విద్య కోర్సుల్లో 30 నుంచి 40 సీట్ల వరకు ఉన్నాయి. వృత్తి విద్య కోర్సుల్లో బాల బాలికలకు ఈటీ, ఎంటీ, సీటీ, ఎంఎల్‌టీ, ఓఏ ఎంపీహెచ్‌డబ్ల్యూఎఫ్‌, ఈ అండ్‌ సీటీ, సెరికల్చర్‌, లైవ్‌స్టాక్‌ మేనేజ్‌మెంట్ అండ్‌ డైరీ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఉత్తీర్ణత ఎలా ఉంది. రాబోయే విద్యాసంవత్సరంలో ఎలాంటి కృషి చేయనున్నారు?

డీఐఈఓ: గత విద్యాసంవత్సరం ప్రథమ సంవత్సరంలో 55, ద్వితీయ సంవత్సరంలో 64 శాతం ఉత్తీర్ణత ఉంది. రాబోయే విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు మరింతగా కృషి చేయనున్నాం. పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని విద్యార్థులను అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేయడం కోసం ‘రెమిడియల్‌ తరగతుల’ను వేసవిలో నిర్వహించాం. ఈ సంవత్సరం ‘కేర్‌ టేకర్‌’ విధానంపై అధిక శ్రద్ధ పెడుతున్నాం. ఈ విధానంలో ప్రతి అధ్యాపకుడు కొంత మంది విద్యార్థులను విద్యాపరంగా దత్తత తీసుకుంటారు. పరీక్షల్లో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యేలా తీర్చిదిద్దుతారు. ప్రత్యేక తరగతులు, యూనిట్ టెస్టులు, రెండు ప్రీఫైనల్‌ పరీక్షలను నిర్వహిస్తాం. ఈ నెలాఖరుకల్లా పాఠ్యపుస్తకాలు అందుతాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఉచిత ఎంసెట్ శిక్షణ ఎలా జరిగింది. హెచ్‌సీఎల్‌ సంస్థ ద్వారా టెక్‌-బీ ఉద్యోగ

అవకాశాలు కల్పించడం లాంటి చర్యలు చేపట్టారు. ఈ విద్యాసంవత్సరంలోనూ కొనసాగిస్తారా?

డీఐఈఓ: జిల్లాలో 138 మంది విద్యార్థులకు ఉచిత ఎంసెట్ శిక్షణను ఇప్పించాం. పలువురు మంచి ర్యాంకులనే సాధించారు. ఈ ఉచిత శిక్షణ ఈ విద్యా సంవత్సరంలోనూ కొనసాగుతుంది. టెక్‌-బీ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

బోధనా సిబ్బంది కొరత ఉందంటున్నారు ?

డీఐఈఓ: అలాంటిదేమీ లేదు. జిల్లాలో 86 మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసును ప్రభుత్వం ఇటీవలనే క్రమబద్ధీకరించింది. 25 మంది వరకు అతిథి అధ్యాపకులు కూడా ఉన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని