logo

ఇంటర్‌ ప్రవేశాలకు వేళాయె..!

ఉన్నత విద్యకు ప్రామాణికమైన ఇంటర్మిడియట్‌ చదివేందుకు ప్ర£వేశాలు ప్రారంభమయ్యాయి. మే 15 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

Published : 09 Jun 2023 04:16 IST

జనగామ ప్రభుత్వ కళాశాలలో చేరాలంటూ ప్రచారం చేస్తున్న అధ్యాపకులు

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: ఉన్నత విద్యకు ప్రామాణికమైన ఇంటర్మిడియట్‌ చదివేందుకు ప్ర£వేశాలు ప్రారంభమయ్యాయి. మే 15 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 30లోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ప్రవేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక్కో సెక్షన్‌లో 88 మంది విద్యార్థులకు మించరాదని స్పష్టం చేశారు. ప్రవేశాల కోసం ప్రైవేటు విద్యాసంస్థలు పరీక్షలు నిర్వహించొద్దని, నిబంధనలకు విరుద్ధంగా చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఓ వైపు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, మరోవైపు ప్రభుత్వ కళాశాలలు ప్రవేశాల కోసం పోటీపడుతున్నారు.

జిల్లాలో ఐదు వేల సీట్లు

జిల్లాలో మొత్తం ఏడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, వృత్తివిద్యా కోర్సుల్లో సుమారు ఐదు వేల వరకు సీట్లు ఉన్నట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17 ప్రైవేటు కళాశాలల్లో పదివేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని కళాశాలల్లో ప్రవేశాల వేట కొనసాగుతూనే ఉంది. గతేడాది జిల్లాలోని ఏ ప్రభుత్వ కళాశాలలో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదని సమాచారం. విద్యార్థుల ప్రవేశాల కోసం ఆయా కళాశాలల్లోని అధ్యాపక బృందం తమదైన శైలిలో ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య ఉందని అవగాహన కల్పిస్తున్నారు. ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెంచేందుకు కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు గ్రామాల్లోకి వెళ్లి తమదైన శైలిలో ప్రచారం చేస్తూ.. ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి కృషిచేస్తున్నారు. గతేడాది ఫర్వాలేదనిపించినా.. ఈ ఏడాది మంచి ఫలితాలు రావడంతో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని  ప్రిన్సిపాల్స్‌ చెబుతున్నారు.

30 తుది గడువు

ఇంటర్‌లో ప్రవేశం పొందాలనుకునే వారు ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 30 వరకు అవకాశం ఉంది. www.tsbie.gov.in  వెబ్‌సైట్‌లో విద్యార్హతల వివరాలను నమోదు చేసి కళాశాలతో పాటు గ్రూపును ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం కళాశాలల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, సాంకేతిక  కారణంతో అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియలో సమస్య తలెత్తుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, తప్పులు జరగకుండా జాగ్రత్తగా వివరాలు నమోదు చేసుకోవాలని, సందేహాలుంటే జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తున్నారు.


నాణ్యమైన విద్య
- డీఈఐవో శ్రీనివాస్‌, జనగామ

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన ప్రాంగణాలు, పలు సౌకర్యాలతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేని విద్య అందుతుంది.  ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం పొందిన వారికి ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నాం. ఈ ఏడాది మంచి ఫలితాలను సాధించాం. ఎక్కువ ప్రవేశాలు వస్తాయని ఆశిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని