logo

బడిలో కలకలం

కొత్త ఆహార పట్టిక ప్రకారం మధ్యాహ్న భోజనంలో వడ్డించిన తీపి పొంగలి, పుదీనా రైస్‌, పప్పుచారు అన్నం తిన్న 21 మంది చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన పాలకోడేరులోని నెం.1 ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది.

Published : 27 Nov 2022 04:30 IST

మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత

ఆసుపత్రి వద్ద విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామరాజు

పాలకోడేరు, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: కొత్త ఆహార పట్టిక ప్రకారం మధ్యాహ్న భోజనంలో వడ్డించిన తీపి పొంగలి, పుదీనా రైస్‌, పప్పుచారు అన్నం తిన్న 21 మంది చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన పాలకోడేరులోని నెం.1 ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం చేసిన నలుగురు విద్యార్థులు వాంతులు వస్తున్నట్టు, కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో ఉపాధ్యాయులు అప్రమత్తమై నలతగా ఉన్న 21 మంది చిన్నారులను స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. ఇంతలోనే జ్వరంతో బాధపడుతున్న 4వ తరగతి విద్యార్థి చింతా ఆదాం వాంతులు చేసుకోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. వైద్యుడు సీహెచ్‌వీఎస్‌ రంగంనాయుడు, సిబ్బంది విద్యార్థులను పరీక్షించి వైద్యసేవలు అందించారు. మధ్యాహ్న భోజనంలో వడ్డించిన పుదీనా రైస్‌ రుచి, వాసన పడకపోవడమే దీనికి కారణమని, సాధారణ చికిత్స అనంతరం అంతా కోలుకున్నారని వైద్యుడు చెప్పారు. చికిత్స అనంతరం విద్యార్థులందరినీ వారి ఇళ్లకు పంపినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.చిట్టిబాబు తెలిపారు.   డీఈవో ఆర్‌.వెంకటరమణ, అధికారులు హుటాహుటిన పాఠశాలకు వెళ్లి చిన్నారులతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల యోగ క్షేమాలు తెలుసుకున్నారు.

కూచింపూడిలో..

పెదవేగి, న్యూస్‌టుడే:   పెదవేగి మండలం కూచింపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో 482 మంది   చదువుతుండగా శనివారం 389 మంది మధ్యాహ్న భోజనం చేశారు. వీరిలో 7వ తరగతి చదువుతున్న 15 మంది  అస్వస్థతకు గురయ్యారు. వీరిలో రామానుజం చిన్నారి, పెద్దిశెట్టి దుర్గారాణి, తుక్కులూరి దుర్గ, కొల్లిపాము సంధ్యలకు వాంతులయ్యాయి. 11 మందికి కడుపునొప్పి రావడంతో వారిని ఉపాధ్యాయులు పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంత మంది విద్యార్థులు భోజనం చేస్తే.. ఒకే తరగతికి చెందిన 15 మందికి ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. వేగివాడ ప్రాథమిక పాఠశాలలో గతనెల 20న మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు ఇద్దరికి అస్వస్థతకు గురై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందారు. ఆ ఘటనను మరువక ముందే శనివారం కూచింపూడిలో ఇలా జరగడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ హుటాహుటిన పీహెచ్‌సీకి చేరుకొని చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని