logo

తీరాన్నీ వదల్లేదు!

మొగల్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన అడ్డగోలు రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పేరుపాలెం తీరంలోని భూములు కూడా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Published : 29 Nov 2022 05:47 IST

ఆక్రమణల్లో భూములు

పేరుపాలెంతీరంలో ఉన్న భూములు

మొగల్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన అడ్డగోలు రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పేరుపాలెం తీరంలోని భూములు కూడా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనికి అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు సూత్రధారని విస్తృత ప్రచారం జరుగుతోంది. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారి పేరున ఆన్‌లైన్లో నమోదు(మ్యుటేషన్‌)కు ప్రయత్నాలు చేశారు.   నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సుమారు 19 కి.మీ. మేర సముద్రతీరం ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ముంపునీరు సముద్రంలోకి ప్రవహించేందుకు వీలుగా గతంలో ఉప్పుటేరు, క్రీకులు ఉండేవి. వాటి ఆయకట్టులో వేలాది ఎకరాల్లో మడ అడవులు, పోరంబోకు, అన్‌సర్వే ల్యాండ్‌ ఉండేది. ప్రస్తుతం ఆ భూములన్నీ ఆక్రమణకు గురయ్యాయి. క్రయవిక్రయాలు జరిగి చేతులు మారుతున్నాయి.

మొగల్తూరు, న్యూస్‌టుడే


ధ్యలోనే నిలిచిన సర్వే..

సుమారు పదేళ్ల కిందట నరసాపురం సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన రొనాల్డ్‌రోజ్‌ పేరుపాలెం సౌత్‌లోని మోళ్లపర్రు ప్రాంత భూముల్లో నిజమైన లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేందుకు సంకల్పించారు. సర్వే పనులు ప్రారంభించినా పూర్తికాలేదు. అవి మధ్యలోనే నిలిచిపోయాయి.


రూపం కోల్పోయిన నల్లీక్రీకు

నరసాపురం మండలం బియ్యపుతిప్ప నుంచి మొగల్తూరు మండలం పేరుపాలెం వరకు ఉన్న నల్లీక్రీకు గత దశాబ్దకాలంగా ఆక్రమణకు గురై రూపం కోల్పోయింది. ప్రస్తుతం తూర్పుతాళ్లు వరకు కొంత మాత్రమే మిగిలి ఉంది. దీన్ని ఆక్రమించుకుని దాని గర్భంలో ఆక్వా చెరువులు తవ్వారు. ఆ భూములకు పైరవీలు చేసి పట్టాలు సంపాదించిన ఘనులూ ఉన్నారు.


ఉప్పుటేరు సమీపంలో..

సముద్ర ముఖద్వారంలో కలిసే ప్రాంతం నుంచి మోళ్లపర్రు బీచ్‌కు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి వరకు సుమారు ఐదు వందల ఎకరాలు పైబడి పట్టా, అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూములు నిత్యం వివాదంలో నానుతూ ఉంటాయి. ఒక్కొక్క భూమిపై ఇద్దరు, ముగ్గురు పేర్లపై పట్టాలు జారీచేసి ఉన్నాయి.   ఎవరు అనుభవదారుడో తెలుసుకోవడం అధికారులకు కూడా కష్టమే. దీంతో రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువగా ఉంటోంది.


క్రయవిక్రయాలు..

సుమారు పదిహేనేళ్ల కిందట ఇతర ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన భూదందా కొనసాగుతూ వచ్చింది. అలా ఆక్రమించుకున్న వందలాది ఎకరాల ప్రభుత్వ, మడ అడవుల భూములను ఆక్వా చెరువులుగా మార్పు చేశారు. వాటిని లీజుకు ఇవ్వడం, విక్రయాలకు పాల్పడటం చేస్తున్నారు.


యజమానులకూ తప్పని అవస్థలు

ఆయా ప్రాంతాల్లో పూర్వం నుంచి సాగుచేసుకుంటున్న వారిలో పలువురికి సరైన ధ్రువపత్రాలు లేవు. దీంతో వారంతా రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం, దళారుల ద్వారా హక్కు పత్రాల కోసం అడ్డదారుల్లో ప్రయత్నిస్తూ ఏదో ఒక పత్రం సంపాదిస్తున్నారు.  సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పైసలు ముట్టజెబితే పనవుతుందని         తెలుసుకున్న మరికొంతమంది రూ.లక్షలు చెల్లించి తమ స్వాధీనంలో ఉన్న భూమిని కుటుంబసభ్యుల పేరున రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. ఆయా భూములకు నకిలీ పట్టాలు సృష్టించిన ఘటనలూ ఉన్నాయి.


మంచి డిమాండు..

తీరప్రాంతం పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ భూములకు మంచి డిమాండ్‌ వచ్చింది. ఈ ప్రాంతంలో జిరాయితీ మెరక భూమి ఎకరం రూ.కోటి నుంచి మూడు కోట్ల వరకూ చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. జిరాయితీ చెరువు భూములకు రూ.50 లక్షల వరకూ ధర పలుకుతోంది. ఈ ప్రాంతంలో ఆక్రమణ, పట్టాభూములను ఎకరం రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. చెరువులకు ఎకరానికి ఏడాదికి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు లీజు వసూలు చేస్తున్నారు.


చర్యలు తీసుకుంటాం

మొగల్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన లావాదేవీల విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలో ఉన్న భూములపై సర్వే చేయాల్సి ఉంది.

జి.అనితాకుమారి, తహశీల్దారు, మొగల్తూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని