logo

ఆవేదన విని.. ఆలోచన పంచుకొని..

బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు వెన్నుదన్నుగా నిలుస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు.

Published : 02 Dec 2022 05:56 IST

కులాల వారీగా సమస్యలను వివరించిన నాయకులు
వెన్నుదన్నుగా నిలుస్తామన్న చంద్రబాబు నాయుడు

రజక సంఘ నాయకుడి సమస్యలను వింటున్న చంద్రబాబు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు వెన్నుదన్నుగా నిలుస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. జంగారెడ్డిగూడెం సమీపంలోని దండమూడి రామలక్ష్మి కల్యాణ మండపంలో గురువారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్‌చంద్రశేషు ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. బీసీ సాధికార ఫెడరేషన్‌ ఛైర్మన్‌, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షత వహించారు. సదస్సు ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ సమాజంలో ఎవరికైనా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉందంటే అది బీసీలకేనన్నారు. తెదేపా అంటే బీసీల పార్టీ, బీసీలంటే తెలుగుదేశం పార్టీ అన్నారు. స్వాతంత్య్రానంతరం పూర్తిగా నష్టపోయిన వర్గాలు బీసీలేనన్నారు. కులవృత్తుల్లో పెను మార్పులు వచ్చి దెబ్బతిన్న కులాలు అవేనన్నారు. అట్టడుగున ఉన్న వీరిని ఆదుకోవాలని నిర్ణయించి, అమలు చేసింది ఎన్టీ రామారావు అన్నారు. సభాధ్యక్షుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బీసీ కులాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులాల వారీగా సమస్యలు వివరిస్తే వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుకుందామని వివరించారు. సదస్సులో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీలు అంగర రామమోహన్‌, సత్యనారాయణరాజు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పీతల సుజాత, నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, పాలి ప్రసాద్‌, జయమంగళ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


విన్నపాలు ఇలా..

మద్యం వ్యాపారం గౌడ, శెట్టిబలిజ తదితర కులాల వారి వృత్తి. ఆ వృత్తిని ప్రభుత్వం దోచుకుంటోంది. మద్యం వ్యాపారంలో 20 నుంచి 25 శాతం ఆయా కులాలకు కేటాయించాలని తెదేపా రాష్ట్ర బీసీ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, గౌడ సంఘం నాయకులు రాంబాబు, దాసరి లోకేష్‌ తదితరులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. తాటిచెట్లు పెంచుకోవడానికి స్థలాలు కేటాయించాలని కోరారు. ఇందుకు సానుకూలత తెలిపిన చంద్రబాబు ఎంత శాతం కేటాయించాలన్నది వెల్లడిస్తామన్నారు. పలు సంఘాల నాయకులు సమస్యలను చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

* జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇవ్వాలని,  ఒకటి కొప్పులవెలమ సామాజిక వర్గానికి కేటాయించాలని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజాన సత్యనారాయణ కోరారు.

* కొల్లేరులోని ఖాళీ భూములను వడ్డీలకు ఒక్కో కుటుంబానికి అరెకరం చొప్పున ఇప్పించాలని ఆ సామాజికవర్గం నాయకుడు రామరాజు విన్నవించారు. డ్రెయిన్లు శుభ్రం చేయాలని కోరారు.

* మట్టి వృత్తుల వారు అణగారిపోతున్నారని ఆ సంఘం నాయకుడు గోపికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

* చెరువులపై రజక వృత్తిదారులకు అధికారం ఇప్పించాలని ఎన్‌.సూర్యనారాయణ విన్నవించారు.

* తూర్పుకాపులు పశ్చిమలోనూ ఎక్కువగా ఉన్నారని, రాజకీయంగా వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తెదేపా నాయకుడు కరణం పెద్దిరాజు కోరారు.

* వివిధ వృత్తుల్లో ఉన్న విశ్వబ్రాహ్మణుల సమస్యలను పార్టీ బీసీ నాయకుడు చిట్రోజు తాతాజీ వివరించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరారు. వివిధ సమస్యలపై ఆయా సంఘాల నేతలు చంద్రబాబుకు వినతిపత్రాలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని