logo

ఖాళీ స్థలాలపై సర్వే

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టణాల్లో నివాసిత ప్రాంతాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల యజమానుల వివరాలను సేకరిస్తున్నారు.

Published : 27 Jan 2023 03:47 IST

శుభ్రం చేయకపోతే జరిమానా

భీమవరంలోని బ్యాంకు కాలనీలో నివాసిత ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టణాల్లో నివాసిత ప్రాంతాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల యజమానుల వివరాలను సేకరిస్తున్నారు.కొందరు కొన్నేళ్ల కిందట కొనుగోలు చేసిన  స్థలాలకు ఇప్పటికీ పన్ను చెల్లించకుండా, కనీసం శుభ్రం చేయించకుండా వదిలేశారు. ఇలాంటి స్థలాలు పందులు, విష సర్పాలకు నిలయాలుగా మారాయి. దోమల ఉత్పత్తి కేంద్రాలయ్యాయి. ప్రస్తుతం రీ సర్వే ప్రక్రియ చేపట్టారు. స్థలం ఎవరిదో, పన్ను చెల్లిస్తున్నారో లేదోననే విషయాలపై సర్వే చేపట్టారు. ఆ స్థలాలను శుభ్రం చేయించకపోతే జరిమానా విధించనున్నారు. సచివాలయాల వారీగా ఖాళీ స్థలాల గుర్తింపు చేపట్టామని పురపాలక రాజమహేంద్రవరం ప్రాంతీయ సంచాలకుడు ఎన్‌.వి.వి. సత్యనారాయణ చెప్పారు. సచివాలయాల పరిధిలోని ఖాళీ స్థలాల యజమానులందరి వివరాలు సేకరిస్తున్నామన్నారు. వాటిని శుభ్రం చేయించాలని సంబంధిత యజమానులకు చెప్పామన్నారు. స్థల వివరాలను యజమానులు నేరుగా సచివాలయాలకు తెలియజేయాలని సూచించారు. 

విలువ ఆధారంగా

పట్టణాల పరిసరాల్లో కొత్తగా కాలనీలు ఏర్పడ్డాయి. వాటిల్లో స్థలం కొనుగోలుచేసిన వారు కొన్నేళ్ల తర్వాత ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి వారిపై స్థలం ఆధారితంగా పన్ను భారం పడుతుంది. ఆ ప్రాంతంలోని రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం పన్ను విధిస్తారు. అదీ మూడేళ్ల వెనుక నుంచి అంటే ఆరు అర్ధ సంవత్సరాల పన్నును నిబంధనల మేరకు చెల్లించాలి. రీ సర్వే సమయంలో ఇలాంటి స్థలాల దస్తావేజులు, ఇతరత్రా వివరాలు, పన్ను చెల్లించిన రశీదులు చూపించకపోయినా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఖాళీ స్థలానికి పన్ను చెల్లిస్తేనే ఆ స్థలంలో ఏదైనా నిర్మాణానికి అనుమతులు ఉంటాయి.

* భీమవరంలోని బ్యాంకు కాలనీ ఏర్పడి 30 ఏళ్లు దాటింది.  అధునాతన భవనాలతో ఉన్న ఈ ప్రాంతంలో ఖాళీ స్థలాలు చిట్టడవుల్లా ఉన్నాయి. వర్షపు నీరు నిలిచి మురుగు, చెత్త, ముళ్ల పొదలతో నిండిపోయాయి. మారుతీనగర్‌, నర్సయ్య అగ్రహారం, వంశీ కృష్ణానగర్‌, హౌసింగ్‌బోర్డు కాలనీ, మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ కాలనీ తదితర చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నాయి.

*  ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం తదితర పట్టణాల్లో గతంలో కొందరు యజమానులను గుర్తించి తాఖీదులు ఇచ్చారు. శుభ్రం చేయించాలని బ్యానర్లను ఏర్పాటు చేశారు. అలాంటి స్థలాలకు పన్ను విధిస్తున్నారో లేదో ప్రస్తుతం పరిశీలిస్తున్నారు.


కొన్నాళ్ల కిందట సర్వే చేయగా పట్టణాల్లో 14వేలకు పైగా ప్రైవేటు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇప్పుడా సంఖ్య మరింత పెరిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని